హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి.. ప్రియుడి ఆత్మహత్య

Lovers ends their life in Hyderabad.వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఓ స్టార్ హోట‌ల్‌లోని రూమ్‌లో అద్దెకు దిగారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2021 3:57 AM GMT
హైదరాబాద్‌లో దారుణం.. ప్రియురాలి గొంతుకోసి.. ప్రియుడి ఆత్మహత్య

వారిద్ద‌రూ ప్రేమించుకున్నారు. ఓ స్టార్ హోట‌ల్‌లోని రూమ్‌లో అద్దెకు దిగారు. అయితే.. ఏం జ‌రిగిందో తెలీదు కానీ.. ప్రేయ‌సిని చంపి ఆపై ప్రియుడు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని మాదాపూర్‌లోని లెమ‌న్ ట్రీ హోట‌ల్‌లో జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళితే.. వికారాబాద్‌ జిల్లా బొంరాసుపేట మండలం లగచర్లకు సంతోషి (25) ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం సిద్ద‌మ‌వుతోంది. నారాయణపేట జిల్లా కోస్గి మండలం హకీంపేటకు చెందిన జి.రాములు (25) రెండు కార్లు కొనుక్కుని హైదరాబాద్‌లో ట్రావెల్స్ వ్యాపారం చేస్తున్నాడు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో స్వగ్రామానికి వెళ్లిన రాములుకు సంతోషితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. బుధవారం వీరిద్దరూ నగరానికి వచ్చి లెమన్‌ట్రీ హోటల్‌లోని మూడో అంతస్తులో ఉన్న 317 నంబరు గదిలో దిగారు.

నిజానికి వీరు గురువారం మధ్యాహ్నం గదిని ఖాళీ చేయాల్సి ఉండగా.. మరో రోజుకు పొడిగించారు. కాగా.. గురువారం సాయంత్రం స‌మ‌యంలో వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఆ స‌మ‌యంలో అటుగా వెలుతున్న రూమ్ బాయ్ లోపలి నుంచి వస్తున్న అరుపులు విని సిబ్బందికి చెప్పాడు. చాలా సేప‌టి నుంచి ఆ రూమ్ నుంచి ఎలాంటి అలికిడి లేక‌పోవ‌డంతో.. అనుమానం వ‌చ్చిన హోట‌ల్ సిబ్బంది మారుతాళంతో గ‌ది త‌లుపులు తెరిచి చూశారు. బాత్రూములో సంతోషి మృతదేహం కనిపించగా.. రాములు మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. బాత్రూంలో రక్తపు మడుగులో వివస్త్రగా పడి ఉన్న సంతోషి మృతదేహాన్ని.. అక్కడినుంచి బెడ్‌ వరకు రక్తంతో కూడిన పాదాల గుర్తులు, రక్తం చుక్కలను గుర్తించారు. గదిలో ఇద్దరి మధ్యా గొడవ జరిగినప్పుడు ఆవేశంతో విచక్షణ కోల్పోయిన రాములు బ్లేడుతో సంతోషి గొంతు కోశాడని.. తర్వాత ఆమె చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హత్యకు ఉపయోగించిన బ్లేడ్‌, ఇతర ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంతోషికి చెందిన వివిధ పోటీ పరీక్షలకు చెందిన పుస్తకాలు, ఓ ప్రైవేటు ఈఎన్‌టీ ఆసుపత్రికి సంబంధించిన ఫైల్, ఆధార్ కార్డులు లభించాయి.

మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిజానికి వీరిద్దరూ గతంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారని, పెద్దలు అంగీకరించకపోవడంతో విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story