Hyderabad: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య.. ఒత్తిడి తట్టుకోలేకే

హైదరాబాద్ లోని నార్సింగ్‌ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

By అంజి  Published on  1 March 2023 4:12 AM GMT
Narsingi, sri chaitanya college, inter student suicide

ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఆత్మహత్య

మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు పుత్రశోకం తప్పలేదు. కళాశాల యాజమాన్య వేధింపులు ఒత్తిడి తట్టుకోలేక ఓ ముక్కు పచ్చలారని విద్యార్థి జీవితం బలయింది. హైదరాబాద్ లోని నార్సింగ్ ప్రాంతంలో ఉన్న శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈ దారుణం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన నాగుల రాజు అనే వ్యక్తి కుమారుడు నాగుల సాత్విక్ (16) తన క్లాస్ గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి క్లాస్ గదిలో ఉరివేసుకోవడం పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కళాశాల ముందు ఆందోళన నిర్వహించారు.ఎక్కువ మార్కులు రావాలని కళాశాల ప్రిన్సిపల్ వార్డెన్ వేధింపులకు గురి చేశారని బాధితులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా రాత్రి 10 గంటలకు స్టడీ అవర్స్ అయిపోయాక విద్యార్థులందరూ హాస్టల్ గదికి చేరుకున్నారు. సాత్విక్ మాత్రం హాస్టల్ కు వెళ్లకుండా క్లాస్ గదిలోనే బట్టలు ఆరవేసే వైరుతో ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు సాత్విక్‌ను బయట వెహికిల్ ని లిఫ్ట్ అడిగి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సాత్విక్ మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ వ్యవహారంపై మృతుడి బంధువులు కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కళాశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కళాశాల యాజమాన్యం ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

రాత్రి 8 గంటలకే తండ్రి నాగుల రాజు తన కుమారుని చివరిసారిగా కలిసినట్టు చెప్పారు. పరీక్షలు అయిపోయాక ఇంటికి రావాలని కోరారు. అంతకుముందు విద్యార్థి సాత్విక్ ఇంట్లో తన నానమ్మకు తనపై ఒత్తిడి పెడుతున్నారని బాగా కొడుతున్నారని చెప్పి వాపోయినట్లు చెబుతున్నారు. సాత్విక్ ను పెద్ద ఎత్తున ఒత్తిడికి గురిచేయడం తిట్టడం, కొట్టడం వల్లే మనస్థాపాన్ని గురై ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. గత వారం రోజులుగా సాత్విక్ తోటి విద్యార్థుల ముందు ఉరి ఎలా వేసుకోవాలనే అనుమానాలను అడిగి తెలుసుకుంటున్నట్లు చెబుతున్నారు. యాజమాన్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని, కళాశాల యాజమాన్యంపై అదే విధంగా ప్రిన్సిపాల్, వార్డెన్ పై హత్య కేసు నమోదు చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Next Story