Hyderabad: ఎర్రగడ్డ వద్ద రోడ్డుప్రమాదం, యువతి దుర్మరణం

హైదరాబాద్‌లో ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 18 Jan 2024 2:00 PM IST

hyderabad, road accident, young girl, dead,

 Hyderabad: ఎర్రగడ్డ వద్ద రోడ్డుప్రమాదం, యువతి దుర్మరణం

హైదరాబాద్‌లో ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎర్రగడ్డ వద్ద ఉన్న భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌పై జరిగిన ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

కర్నూలు జిల్లా శ్రీశైలం ప్రాంతానికి చెందిన సునీత (26) అనే యువతి కూకట్‌పల్లిలో ఉంటోంది. అక్కడే ఉంటూ ప్రయివేట్‌ జాబ్‌ చేస్తోంది. గురువారం ఉదయం డ్యూటీలో భాగంగానే ఆఫీసుకు బయల్దేరింది. స్కూటీపై డ్యూటీకి వెల్తున్న సమయంలో భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌ వద్ద వెనకాల నుంచి వాటర్‌ ట్యాంకర్‌ స్కూటీని ఢీకొట్టింది. దాంతో.. సునీత పక్కనే వెల్తున్న ఆర్టీసీ బస్సు టైర్ల కింద పడిపోయింది. బస్సు చక్రాల కింద పడిపోవడంతో నలిగిపోయింది. క్షణాల్లోనే ప్రాణాలను విడిచింది. కూకట్‌పల్లి నుంచి ఎర్రగడ్డకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాదం గురించి ఇతర వాహనదారులు వెంటనే పోలీసులకు చెప్పారు.

ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. యువతిని ఢీకొట్టిన తర్వాత వెంటనే వాటర్‌ ట్యాంకర్‌ను వదిలేసి డ్రైవర్ పరారు అయ్యాడు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని చెప్పారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఇక చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామనీ.. త్వరలోనే వాటర్‌ ట్యాంకర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.

Next Story