Hyderabad: మాదాపూర్లో యువకుడు దారుణ హత్య
మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.
By అంజి
Hyderabad: మాదాపూర్లో యువకుడు దారుణ హత్య
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మణికొండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21).. తన తల్లి జన్మదినం సందర్భంగా ఇంట్లో కేక్ కట్ చేసిన అనంతరం తన ఫ్రెండ్స్తో కలసి బయటకు వెళ్లాడు. అక్కడ జయంత్ గౌడ్ తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా.. అక్కడకు ముగ్గురు దుండగులు వచ్చారు. వారు తాగుతున్న మద్యం బాటిల్ ఇవ్వాలని ముగ్గురు దుండగులు గొడవకు దిగారు. జయంత్, అతని స్నేహితులు కలిసి మద్యం బాటిల్ ఇచ్చేది లేదని కరాకండిగా చెప్పారు. దీంతో ఇరు వర్గాల వారి మధ్య గొడవ చెలరేగింది.
మద్యం మత్తులో ఉన్న జయంత్.. దుండగులతో గొడవకు దిగడంతో ఆగ్రహానికి లోనైన దుండగులు జయంత్ పై ఒక్కసారిగా దాడి చేసి కత్తితో ఛాతిలో గట్టిగా పొడిచి అక్కడినుండి పారిపోయారు. తీవ్ర గాయాలు అయినా జయంత్ను స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ యువకుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు. కత్తి దాడిలో జయంత్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లనుపోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.