Hyderabad: గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధించిన 122 మందికి జైలు శిక్ష
గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా మహిళలను ఆటపట్టిస్తూ వేధింపులకు పాల్పడిన 488 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
By న్యూస్మీటర్ తెలుగు Published on 6 Oct 2023 9:32 AM IST
Hyderabad: గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధించిన 122 మందికి జైలు శిక్ష
గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా మహిళలను ఆటపట్టిస్తూ వేధింపులకు పాల్పడిన 488 మందిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అసభ్యకర చర్యలకు పాల్పడుతున్న వారిని, మహిళలను అనుచితంగా తాకుతున్న వ్యక్తులను షీ టీమ్లు వీడియో ఆధారాలతో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సెప్టెంబర్ 18 నుంచి 28 వరకు బడా గణేష్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్ వద్ద 488 మందిని వీడియో ఆధారాలతో బృందాలు పట్టుకున్నాయి. మహిళలు క్యూలైన్లలో వేచి ఉన్నప్పుడు లేదా మతపరమైన విధులు నిర్వహిస్తున్నప్పుడు నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు.
నిందితుల్లో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వారు మహిళలను అనుచితంగా తాకడం, అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, అసభ్యకర సంజ్ఞలు చేయడం వంటివి చేశారు. నమోదైన మొత్తం కేసుల్లో 122 మంది నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా వారికి మూడు నుంచి ఆరు రోజుల జైలు శిక్ష విధించారు. 111 కేసుల్లో నిందితులను హెచ్చరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. 255 కేసుల్లో నిందితులను కోర్టులో హాజరుపరచాల్సి ఉంది.
షీ టీమ్లు కాల్ లేదా మెసేజ్ల ద్వారా రెస్పాండ్ అవుతారు. వేధింపులు లేదా వేధింపులకు సంబంధించిన ఏదైనా ఫిర్యాదును హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్, 9490616555తో షేర్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో 100కి డయల్ చేయవచ్చు.
బహిరంగ ప్రదేశాల్లో, జర్నీ సమయంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి, వేధింపులు లేదా ఈవ్ టీజింగ్లు జరిగే అవకాశం ఉన్న రద్దీగా ఉండే ప్రాంతాల చుట్టూ షీ టీమ్లు గస్తీ నిర్వహిస్తాయి. వేధింపులు, టీజింగ్లు ఎక్కడ చూసినా వీడియో ఆధారాలతో నిందితులను షీ టీమ్స్ బృందాలు పట్టుకుంటాయి. ఆ తర్వాత వేధింపులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తారు.