దారుణం.. కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి.. బాలిక‌పై హాస్ట‌ల్ కరస్పాండెంట్ అత్యాచారం

Hostel Correspondent Molested minor girl in Kakinada.ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Jun 2022 5:02 AM GMT
దారుణం.. కరోనా మందు పేరుతో మత్తు మందు ఇచ్చి.. బాలిక‌పై హాస్ట‌ల్ కరస్పాండెంట్ అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు ఉన్న‌ప్ప‌టికీ మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. నిత్యం ఏదో ఒక చోట మ‌హిళ‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డుతూనే ఉన్నారు. కామంతో క‌ళ్లుమూసుకుపోయిన కామాంధులు రెచ్చిపోతున్నారు. వావి-వ‌రుస‌, చిన్నా-పెద్దా అని తేడా లేదు. వీరి కార‌ణంగా పాఠ‌శాల‌ల్లో, వ‌స‌తి గృహం ఉంటున్న బాలిక‌లు, విద్యార్థినుల‌కు కూడా ర‌క్ష‌ణ లేకుండా పోతుంది. ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటున్న 15 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల కరస్పాండెంట్ పలుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. ఈ దారుణ ఘ‌ట‌న కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. కాకినాడ న‌గ‌రానికి చెందిన 15 ఏళ్ల బాలిక కొండ‌య్య‌పాలెంలోని ఓ ప్రైవేటు వ‌స‌తి గృహంలో ఉంటూ స‌మీపంలో ఉన్న పాఠ‌శాల‌లో చ‌దువుకుంటోంది. ఆరో త‌ర‌గ‌తి నుంచి ఆ బాలిక అదే వస‌తి గృహంలో ఉంటోంది. ఇటీవ‌లే ఆ బాలిక తొమ్మిదో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు రాసింది. కాగా.. ఆబాలిక‌పై వ‌స‌తి గృహం కరస్పాండెంట్ కొత్తపల్లి విజయకుమార్ (60) కన్ను పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో బాలిక‌కు మాయ‌మాట‌లు చెప్పి త‌న గ‌దికి తీసుకువెళ్లాడు.

కరోనా మాత్రలంటూ బాలికకు కొన్ని మాత్రలు ఇచ్చాడు. అవి వేసుకున్నాక బాలిక మత్తులోకి జారుకుంది. ఆ తర్వాత అత‌డు బాలిక‌పై ప‌లు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వేసవి సెలవుల కావ‌డంతో ఇంటి వద్ద ఉంటున్న బాలిక మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో తల్లి ఆరా తీయగా అస‌లు విష‌యం బ‌య‌ట‌పడింది. బాలిక‌ను చికిత్స నిమిత్తం ఈ నెల 1న కాకినాడ జీజీహెచ్‌కు త‌ర‌లించారు. బాధితురాలి ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని, గ‌ర్భ‌స్రావం అయిన‌ట్లు వైద్యులు తెలిపారు. బాధిత బాలిక త‌ల్లి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story