ఫ్లాట్‌లో శవమై కనిపించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

సూరత్‌లోని జహంగీర్‌పురా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో సీనియర్‌ సిటిజన్‌లు అయిన ఓ వృద్ధుడు, ముగ్గురు మహిళలు శవమై కనిపించారు.

By అంజి  Published on  16 Jun 2024 3:30 AM GMT
senior citizens, Surat, Crime

ఫ్లాట్‌లో శవమై కనిపించిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

శనివారం సూరత్‌లోని జహంగీర్‌పురా ప్రాంతంలోని ఓ ఫ్లాట్‌లో సీనియర్‌ సిటిజన్‌లు అయిన ఓ వృద్ధుడు, ముగ్గురు మహిళలు శవమై కనిపించారు. ప్రాథమికంగా, ఫ్లాట్‌లో గ్యాస్‌తో నడిచే గీజర్ నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించడంతో వారు ఊపిరాడక మరణించారని తెలుస్తోంది. అయితే మృతికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. నిద్రకు ముందు కలిసి భోజనం చేయడంతో ఫుడ్‌ పాయిజన్‌ ​​అయిందని పోలీసులు ప్రాథమికంగా అనుమానించారు. అయితే తొమ్మిది మంది కలిసి రాత్రి భోజనం చేయగా మిగిలిన వారు క్షేమంగా ఉన్నారు.

ఫ్లాట్ యజమాని జాషుబెన్ వాదేల్, ఆమె సోదరీమణులు శాంతబెన్ వాదేల్ (53), గౌరీబెన్ మేవాద్ (55), గౌరీబెన్ భర్త హీరాభాయ్ (60) మృతదేహాలు అపార్ట్‌మెంట్‌లో లభ్యమైనట్లు పోలీసు అధికారి తెలిపారు. బాధితులు శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నిద్రకు ఉపక్రమించినట్లు తెలిపారు.

జాషు బెన్ కుమారుడు ముఖేష్ ఉదయం టీ ఇచ్చేందుకు ఫ్లాట్‌కు వెళ్లినా స్పందన రాకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వారు అపస్మారక స్థితిలో పడి ఉన్నారని గుర్తించడానికి అతను ఫ్లాట్‌ను తెరవడానికి ఒక కీని ఉపయోగించాడు. బాధితులు వాంతులు కూడా చేసుకున్నారు. వారి శరీరాలపై ఎలాంటి గాయాలు, గుర్తులు లేవు.

అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారించబడనప్పటికీ, గ్యాస్‌తో నడిచే గీజర్‌ను వదిలివేయడం వల్ల ఊపిరాడక కుటుంబ సభ్యులు మరణించే అవకాశం ఉంది. అయితే పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Next Story