విహారయాత్రలో విషాదం.. నలుగురు మృతి
Four dead including three childrens in veligallu dam reservoir project.కడప జిల్లాలో విషాదం నెలకొంది. విహార యాత్రకు
By తోట వంశీ కుమార్ Published on 8 Aug 2021 5:04 AM GMT
కడప జిల్లాలో విషాదం నెలకొంది. విహార యాత్రకు వెళ్లి మడుగులో నీటిని చూసి సరదాగా స్నానం కోసం దిగిన నలుగురు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించారు. కడప జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు వద్ద గండి మడుగులో జరిగిందీ ఘటన. వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 10 మంది కుటుంబసభ్యులు విహార యాత్ర కోసం బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లాలోని వాల్మీకుపురంలో ఉంటున్న బంధువుల ఇంటికి వచ్చారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువులందరూ కలసి మొత్తం 20 మంది శనివారం వెలిగల్లు ప్రాజెక్టు వద్దకు వచ్చారు.
బెంగళూరు నుండి వచ్చిన 10 మంది చిత్తూరు జిల్లాలోని బంధువులందరూ మొత్తం 20 మంది కలసి వెలిగల్లు ప్రాజెక్టు వద్ద సరదాగా గడుపుతుండగా కొందరు మడుగును చూసి ముచ్చట పడ్డారు. మడుగు నీరు లోతు తక్కువగా ఉండడంతో కొందరు ఈతకు దిగారు. వీరిలో నలుగురు ప్రమాద వశాత్తు గల్లంతైన మునిగిపోవడంతో సరదాగా ఉన్న బంధుమిత్రులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్ధానికులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు.
మృతులను బెంగుళూరుకు చెందిన తాజ్ మహ్మద్(40), మహ్మద్ హంజా(12), ఉస్మాన్ ఖానమ్(11), మహ్మద్ హఫీజ్(10)లుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.