విషాదం.. భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి భ‌ర్త ఆత్మ‌హ‌త్య‌

Father commits suicide and 2 children.భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఓ భ‌ర్త త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి అనంత‌రం తాను ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 5:56 AM GMT
father commits suicide

భార్య మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేని ఓ భ‌ర్త త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విష‌మిచ్చి అనంత‌రం తాను ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ హృద‌య విదాక‌ర ఘ‌ట‌న విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. అన‌కాప‌ల్లి మ‌త్రాసు కాల‌నీలో కొక్కిర స‌త్య‌నారాయ‌ణ‌(42) అనే వ్య‌క్తి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఓ ఫార్మాసిటీలో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. అయితే.. రెండు నెల‌ల క్రితం అత‌డి భార్య పుష్ప‌ల‌త‌(38) అనారోగ్యంతో క‌న్నుమూసింది. భార్య మ‌ర‌ణించిన‌ప్ప‌టి నుంచి స‌త్య‌నారాయ‌ణ తీవ్ర మాన‌సిక ఆందోళ‌నకు గురైయ్యాడు. ఎప్పుడూ భార్య గురించిన ఆలోచ‌న‌ల‌తోనే గ‌డిపేవాడ‌ని స్థానికులు అంటున్నారు.

భార్య గుర్తుకు వ‌స్తుంద‌ని ప‌దే ప‌దే చెప్పేవాడ‌ని అంటున్నారు. ఇక ఇద్ద‌రు పిల్ల‌ల‌ను ఒక్క‌డినే ఎలా పెంచి పెద్ద చేయాల‌ని బాద‌ప‌డేవాడు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం రాత్రి మొద‌ట పిల్ల‌ల‌కు విష‌మిచ్చి.. అనంత‌రం అత‌డు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. బుధ‌వారం ఉద‌యం స‌త్య‌నారాయ‌ణ అత్త‌ త‌లుపు తెరిచి చూడ‌గా.. ముగ్గురు విగ‌జీవులుగా క‌నిపించారు. స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు మృత‌దేహాల‌ను ప‌రిశీలించి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అనంత‌రం కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద‌చాయ‌లు అలుముకున్నాయి.


Next Story