ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వెళ్తూ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు స్పాట్లోనే చనిపోయారు. టీజీ 04 ఏ 4744 టాటా ఆల్టోజ్ కారులో వియం బంజర్ వైపు నుంచి సతుపల్లి వెళ్తుండగా కిష్టారం, అంబేద్కర్ కాలనీ వద్ద రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
కాగా మృతులను సత్తుపల్లి కొంపల్లి కాలనీ చెందిన విద్యార్థులు జయ్, శశి, మహబూబ్ నగర్ చెందిన సాజిద్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న మరో ఇద్దరు యువకులు తలారి అజయ్, ఇమ్రాన్ లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక సత్తుపల్లి పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకొని క్షతగాత్రులను సత్తుపల్లి హాస్పిటల్ కు తరలించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.