కదులుతున్న బస్సులో.. మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ అత్యాచారం

Driver‌ sexual assault on female passenger. కదులుతున్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రయాణికురాలిని కత్తితో

By అంజి  Published on  27 Feb 2022 2:11 AM GMT
కదులుతున్న బస్సులో.. మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ అత్యాచారం

కదులుతున్న ప్రైవేట్‌ స్లీపర్‌ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలిపై డ్రైవర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రయాణికురాలిని కత్తితో బెదిరించి డ్రైవర్‌ అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, దౌర్జన్యం కేసులు నమోదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మహిళ (29) మాదాపూర్‌ ప్రాంతంలో తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటోంది. ఆమె హైదరాబాద్‌ నగరంలో బేబీ కేర్‌టేకర్‌గా పని చేస్తున్నారు. పలు కారణాల వల్ల ఆమె భర్త వేరుగా ఉంటున్నాడు. ఈ నెల 23వ తేదీన కూకట్‌పల్లిలో బాధిత మహిళ సొంతూరు వెళ్లేందుకు ప్రైవేట్‌ బస్సు ఎక్కింది. ఆమెకు బస్సులోని చివరి సీటు కేటాయించారు. బస్సులో మరికొందరు ప్రయాణికులు కూడా ఉన్నారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ''అర్థరాత్రి 12.30 గంటల సమయంలో అందరూ నిద్రపోతుండగా డ్రైవర్‌ రాజేష్‌ మహిళ దగ్గరికి వెళ్లాడు. మరో డ్రైవర్‌ బస్సు నడుపుతుండగా రాజేష్‌ తన దగ్గర ఉన్న కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో బస్సు సూర్యాపేట దాటుతోంది. 24వ తేదీ ఉదయం బస్సు దిగుతున్న సమయంలో మహిళను బెదిరించి రూ.7 వేలు లాక్కున్నాడు'' అని పోలీసు అధికారి తెలిపారు. శనివారం నాడు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే బాధితురాలికి న్యాయం చేయాలంటూ కూకట్‌పల్లిలో గవర్నర్‌ తమిళి సై కాన్వాయ్‌ను ఆమె బంధువులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Next Story