భర్తతో గొడవ.. మూడేళ్ల పాపను చంపిన తల్లి.. మృతదేహంతో 4 కి.మీ..

మహారాష్ట్రలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  22 May 2024 8:20 AM GMT
crime, mother, kill, daughter, maharashtra,

భర్తతో గొడవ.. మూడేళ్ల పాపను చంపిన తల్లి.. మృతదేహంతో 4 కి.మీ..

మహారాష్ట్రలో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. భర్తతో గొడవ పడ్డ ఓ మహిళ దారుణంగా ప్రవర్తించింది. తన మూడేళ్ల కూతురు గొంతు కోసి హత్య చేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగర్‌పూర్‌లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంఐడీసీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. నిందితురాలు ట్వింకిల్ రౌత్ (23), ఆమె భర్త రామ్‌ లక్ష్మణ్ రౌత్ (24) ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం నాగ్‌పూర్‌కు వచ్చారు. అక్కడే ఉన్న ఓ పేపర్‌ తయారీ కంపెనీలో వీరిద్దరూ పని చేస్తున్నారు. ఎంఐడీసీ ప్రాంతంలోనే ఉన్న ఓ గదిలో వీరు నివసిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరి దాంపత్య జీవితానికి ఒక కూతురు కూడా పుట్టింది. ఆమెకు మూడేళ్ల వయసు. అయితే.. కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య మనస్పర్ధాలు వచ్చాయి. అపనమ్మకం కారణంగా తరచూ గొడవ పడుతుండే వారు. ఈ క్రమంలోనే ఈ నెల 20వ తేదీ సోమవారం సాయంత్రం కూడా మరోసారి భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

తల్లిదండ్రులు గొడవ పడుతున్న క్రమంలో మూడేళ్ల చిన్నారి భయాందోళనకు గురై గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో.. తల్లి పాపను తీసుకుని బయటకు ఆగ్రహంతో వెళ్లిపోయింది. భర్తపై కోపంతో బయటకెళ్లిన మహిళ.. దారుణంగా ప్రవర్తించింది. ఏడుస్తున్న కూతురిని బుజ్జగించడం మాని.. ఆమెను ఓ చెట్టు కిందకు తీసుకెళ్లి గొంతు కోసి హత్య చేసింది. ఆ తర్వాత మృతదేహంతో నాలుగు కిలోమీటర్ల మేర నడిచింది. ఇక అప్పటికే సమయం రాత్రి 8 గంటలు కావొచ్చిందని పోలీసులు తెలిపారు. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు.. ఆ మహిళను గుర్తించారని చెప్పారు. రక్తస్రావంతో ఉన్న పాపను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించిన అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. అనంతరం పోలీసులు సదురు మహిళను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత మహిళను కోర్టు హాజరుపర్చగా.. మే 24వ తేదీ వరకు పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చారని పోలీసులు తెలిపారు.

Next Story