దారుణం.. త‌న ప్రేమ‌ను నిరాక‌రించింద‌ని రైలు కింద‌కు తోసేశాడు

College student pushed in front of moving train in Chennai.త‌న ప్రేమను అంగీక‌రించ‌లేద‌ని ఓ యువ‌తిని రైలు కింద‌కు తోసేసి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Oct 2022 3:10 AM GMT
దారుణం.. త‌న ప్రేమ‌ను నిరాక‌రించింద‌ని రైలు కింద‌కు తోసేశాడు

త‌న ప్రేమను అంగీక‌రించ‌లేద‌ని ఓ యువ‌తిని రైలు కింద‌కు తోసేసి హ‌త‌మార్చాడో ప్రేమోన్మాది. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలోని చెన్నైలో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. చెన్నై గిండి స‌మీప ఆదంబాక్కానికి చెందిన మాణిక్యం స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఇత‌డి కుమార్తె స‌త్య (20) టీన‌గ‌ర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం సెకండియ‌ర్ చ‌దువుతోంది. వీరు ఉంటున్న ప్రాంతానికి చెందిన స‌తీష్ అనే వ్య‌క్తితో స‌త్య‌ప్రియ‌కు ప‌రిచ‌యం ఉంది.

స‌త్య‌ప్రియ‌ను ప్రేమిస్తున్నానంటూ స‌తీష్ వెంట‌ప‌డుతుండ‌డంతో అత‌డిని ఆమె దూరం పెట్టింది. దీంతో స‌తీష్ కోపం పెంచుకున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లేందుకు స‌త్య సెయింట్ థామ‌స్ మౌంట్ రైల్వే స్టేష‌న్‌లో రైలు కోసం ఫ్లాట్‌ఫాంపై నిలుచుంది. అక్క‌డ‌కు వ‌చ్చిన స‌తీశ్.. స‌త్య‌ప్రియ‌తో వాగ్వాదానికి దిగాడు. ఆ స‌మ‌యంలో తాంబ‌రం నుంచి వ‌స్తున్న రైలు కింద‌కు తోసేశాడు. రైలు ఢీ కొన‌డంతో స‌త్య ప్రియ ఘ‌ట‌నాస్థ‌లంలోనే మృతి చెందింది. స‌మాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుడు స‌తీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Next Story