బిగ్ బాస్ సీజన్-8 ఫేమ్ కంటెస్టెంట్ ఆర్జే శేఖర్ బాషా మరో కేసులో ఇరుకున్నారు. అతడిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ అతనిపై పోలీసులకు కంప్లయింట్ చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా.. తన పర్సనల్ కాల్ రికార్డ్స్ను శేఖర్ బాషా లీక్ చేశాడనే కారణంతో పోలీసులకు కంప్లయింట్ చేసినట్ల శ్రేష్టి వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తన పరువుకు భంగం కలిగేలా, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్లో మాట్లాడుతున్నాడని తన ఫిర్యాదులో తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రైవేట్ కాల్ రికార్డ్స్ లీక్ చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. శేఖర్ బాషా వ్యక్తిగత మొబైల్తో పాటు అతనికి సంబంధించిన ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లను సీజ్ చేయాలని బాధితురాలు పోలీసులను కోరింది. కాగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు శేఖర్ బాషాపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 79, 67, ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.