మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. చెట్టుకు వేలాడుతూ ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు అనుమానాస్పద స్థితిలో లభ్యమయ్యాయి. ఈ ఘటన ఖండ్వా జిల్లాలోని జవర్ పోలీస్ పరిధిలోని కొత్కేది గ్రామంలో జరిగింది. మృతులను ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు సోను (22), సావిత్రి (21), లలిత(19)గా గుర్తించారు. వీరిలో ఇద్దరు ఖండ్వా ఎస్ఎన్ కాలేజీలో చదువుతున్నారు. తల్లి, సోదరుడితో ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు నివసిస్తుండేవారు. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.
అయితే వీరి మృతికి కారణం ఏంటనేది ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలను పోలీసులు ఇంకా గుర్తించలేదు. అయితే అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య చేసుకోని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల తర్వాత ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గ్రామ శివారులో చెట్టుకు వేలాడుతూ అక్కాచెల్లెళ్ల మృతదేహాలు కనిపించడంతో స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. జావర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ శివ్ రామ్ జాట్ మాట్లాడుతూ.. ''అక్కాచెల్లెళ్ల మృతి విషయం వారి కుటుంబం, పరస్పర సంబంధాలకు సంబంధించినది కావచ్చు. చనిపోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లలో ఒకరికి పెళ్లయి, రెండు రోజుల క్రితం తన తల్లి ఇంటికి వచ్చింది.'' అని చెప్పారు. మృతుల ఆత్మహత్యకు గల కారణాలను బంధువులు చెప్పలేకపోతున్నారు.