పింగళి వెంకయ్య మనవడు గోపీ భార్యపై కత్తితో దాడి

పింగళి వెంకయ్య మనవడు గోపీ కృష్ణ భార్య సునీతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.

By Srikanth Gundamalla  Published on  2 Nov 2023 12:34 PM GMT
attack,  malkajgiri, crime, police,

 పింగళి వెంకయ్య మనవడు గోపీ భార్యపై కత్తితో దాడి

మేడ్చల్‌ జిల్లాలోని మల్కాజిగిరిలో దారుణం చోటుచేసుకుంది. పింగళి వెంకయ్య మనవడు గోపీ కృష్ణ భార్య సునీతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ సునీతను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

పింగళి వెంకయ్య మనవడు గోపీకృష్ణ భార్య సునీత మల్కాజిగిరిలోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నారు. అయితే.. బుధవారం సాయత్రం స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్‌ వద్ద ఎక్కువదామని వేచి చూసింది. అయితే.. అప్పటికే అక్కడ దాగివున్న ఓ వ్యక్తి.. సునీత లిఫ్ట్‌లోకి వెళ్తుండగా ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో సునీత కుడి భుజంపై కత్తిగాడ్లు పడ్డాయి. దాంతో..ఆమె గట్టిగా అరవడం ప్రారంభించింది. సునీత కేకలు విన్న స్థానికులు వెంటనే లిఫ్ట్‌ వద్దకు చేరుకున్నారు.

అయితే.. నిందితుడు అప్పటికీ అక్కడే ఉండటంతో అతనిపై దాడి చేశారు. చితక్కొట్టి తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు నేరేడ్‌మెట్‌ పోలీసులు అక్కడి చేరుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..కత్తితో దాడి చేసిన వ్యక్తిని శ్రీకర్‌గా గుర్తించారు. గతంలో అతను ఉద్యోగం కోసం ఓ మహిళకు రూ.30వేలు చెల్లించినట్లు పోలీసులు చెప్పారు. డబ్బులు తీసుకున్న మహిళ శ్రీకర్‌కు ఉద్యోగం ఇప్పించలేదు. దాంతో కోపం పెంచుకున్న శ్రీకర్‌ ఆమెకు బుద్ది చెప్పాలనుకున్నాడు. అయితే.. డబ్బులు తీసుకున్న మహిళను శ్రీకర్‌ గుర్తుపట్టకపోగా.. బుధవారం సునీతను చూసి ఆమెనే అనుకున్నాడు. దాంతో కత్తితో దాడి చేశాడని.. తమ ముందు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. కాగా.. శ్రీకర్ మానసిక పరిస్థితి కూడా బాగోలేదని పోలీసులు అంటున్నారు. ఇక సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు నేరేడ్‌మెట్‌ పోలీసులు తెలిపారు.

Next Story