బాలాపూర్ హత్య: నిందితుడిని పట్టించిన మృతుడి ఫోన్‌

తన స్నేహితుడు ఫైసల్ (25)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పడేసిన 22 ఏళ్ల జబ్బార్‌ను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు.

By అంజి  Published on  26 Feb 2023 1:15 PM GMT
బాలాపూర్ హత్య: నిందితుడిని పట్టించిన మృతుడి ఫోన్‌

హైదరాబాద్: తన స్నేహితుడు మహ్మద్ షా ఫైసల్ (25)ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పడేసిన 22 ఏళ్ల అబ్దుల్ జబ్బార్‌ను బాలాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. బాలాపూర్‌లోని ఉస్మాన్‌నగర్‌కు చెందిన ఫైసల్‌ తండ్రి మహ్మద్‌ జాఫర్‌ తన కుమారుడు కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఆ తర్వాత కనిపించలేదు. విచారణలో భాగంగా బాలాపూర్ పోలీసులు ఫిబ్రవరి 25 న సీడీఆర్‌ డేటాను సేకరించారు. మరొక సిమ్‌ కార్డ్‌తో యాక్టివేట్ చేయబడిన బాధిత వ్యక్తి మొబైల్ ఫోన్‌ను కనుగొన్నారు.

వారు దాని ఆధారంగా సయ్యద్ షాహీద్ అనే వ్యక్తికి పట్టుకున్నారు. అతడిని విచారించగా బాలాపూర్‌లోని మినార్‌ కాలనీలో వజాహత్‌ అలీ నుంచి ఫోన్‌ కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు. షాహీనగర్‌లోని అబ్దుల్ జబ్బార్ నుంచి ఫోన్ కొనుగోలు చేసినట్లు వజాహత్ అలీ పోలీసులకు తెలిపాడు. అబ్దుల్‌ను అతని ఇంట్లోనే పట్టుకున్నారు. ఫైసల్‌ను హత్య చేసి మృతదేహాన్ని కొన్ని రాళ్ల వెనుక పాతిపెట్టినట్లు అతడు అంగీకరించాడు. మృతుడు పైజల్‎కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని, ప్రస్తుతం అతని భార్య ప్రెగ్నెంట్‎గా ఉన్నట్లు తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మహ్మద్ షా ఫైసల్, నిందితుడు అబ్దుల్ జబ్బార్ మధ్య స్నేహం ఉంది. ఫిబ్రవరి 12న ఫైసల్ నిందితుడిని సంప్రదించి మినార్ కాలనీలోని తన ఇంటికి వెళ్లాడు. అనంతరం నిందితుడి ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లారు. ఫైసల్ అబ్దుల్‌ని తనతో బయటకు రమ్మని ఆహ్వానించాడు, కానీ అతడు నిరాకరించాడు. తీవ్ర వాగ్వాదం తర్వాత ఫైసల్ జబ్బార్‌ను దుర్భాషలాడాడు. దీంతో నిందితుడు చెక్క కర్ర తీసుకుని ఫైసల్ తలపై కొట్టడంతో అతడు నేలకూలాడు. దీంతో నిందితుడు రాయితో కొట్టి ఫైసల్ తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని వదిలేసి మొబైల్ ఫోన్‌ను దొంగిలించాడు.

Next Story