వికారాబాద్ జిల్లా తట్టెపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రుక్మాపూర్ గ్రామానికి చెందిన పావని (35), ఆమె భర్త కవిరాజ్ (40) జహీరాబాద్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం కీర్తన (11), కార్తీక్ (13). వచ్చే నెల ఒకటో తేదీన పావని సోదరుడి వివాహం ఉన్న నేపథ్యంలో, నిన్న సాయంత్రం జహీరాబాద్ నుండి రుక్మాపూర్ గ్రామానికి గడప కడిగే కార్యక్రమం కోసం వచ్చారు. కార్యక్రమం ముగించుకొని ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో తమ హోండా యాక్టివా (TS 15 FH 1030) పై తిరిగి జహీరాబాద్కు బయలుదేరారు.
ఈ క్రమంలో తట్టెపల్లి గ్రామ శివారులోకి రాగానే, జహీరాబాద్ నుండి తాండూర్ వైపు స్టోన్ నిమిత్తం వస్తున్న లారీ(TS 08 UH 0018) అతివేగంగా, అజాగ్రత్తగా వస్తున్న వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పావని (35), భర్త కవిరాజ్ (40), కుమార్తె కీర్తన (11) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు కార్తీక్ (13) స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడగా, చికిత్స నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను శవపంచనామా నిమిత్తం తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మహమ్మద్ షరీఫ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ తెలిపారు.