Hyderabad: కిరాణా కొట్టు ముసుగులో.. భారీగా గంజాయి చాక్లెట్ల విక్రయం

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణంపై సైబరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) దాడులు చేసింది.

By అంజి  Published on  15 April 2024 4:06 AM GMT
ganja chocolates, grocery store, Jagadgirigutta, Hyderabad

Hyderabad: కిరాణా కొట్టు ముసుగులో.. భారీగా గంజాయి చాక్లెట్ల విక్రయం

హైదరాబాద్‌: గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న ఓ కిరాణా దుకాణంపై సైబరాబాద్‌ పోలీసుల స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) దాడులు చేసింది. ఈ ఆపరేషన్‌లో పెద్దఎత్తున గంజాయి చాక్లెట్లు, గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట అంజయ్య నగర్‌లోని జయశ్రీ ట్రేడర్స్‌ లో కల్తీ పదార్థాల విక్రయాలపై విశ్వసనీయ సమాచారం అందడంతో మాదాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు, జగద్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడిలో పోలీసులు 160 ప్యాకెట్ల గంజాయి చాక్లెట్లు, 4 కిలోల గంజాయి పొడిని స్వాధీనం చేసుకున్నారు.

కోల్‌కతాకు చెందిన షాపు యజమాని మనోజ్ కుమార్ అగర్వాల్‌ను పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కోల్‌కతాకు చెందిన మోహన్ అనే వ్యాపారి ప్రమేయం ఉందని, అతను దుకాణానికి క్రమం తప్పకుండా గంజాయి చాక్లెట్‌లను సరఫరా చేస్తున్నట్లు అంగీకరించాడు. ఈ నిషేధిత చాక్లెట్ల ఒక్కో ప్యాకెట్‌లో 40 ముక్కలు ఉన్నాయని, ఒక్కో ప్యాకెట్‌కు రూ.1,000 మార్కెట్ విలువతో. పట్టుబడిన చాక్లెట్ల మొత్తం విలువ దాదాపు రూ. 2,56,000. నిందితులపై జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.

Next Story