క్రికెట్ బెట్టింగ్‌కి డిగ్రీ విద్యార్థి బలి

ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోవడంతో అందిన చోట అప్పులు చేశాడు.

By అంజి  Published on  23 July 2023 3:45 AM GMT
degree student, suicide, Crime news

క్రికెట్ బెట్టింగ్‌కి డిగ్రీ విద్యార్థి బలి 

హైదరాబాద్: ఐపీఎల్ బెట్టింగ్‌లో పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. బెట్టింగ్ ఆడి పెద్ద మొత్తంలో నష్టపోవడంతో అందిన చోట అప్పులు చేశాడు. అప్పుల వాళ్ళు తిరిగి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో అప్పుల బాధ తట్టుకోలేక డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతున్న సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్కీ బాయ్స్ హాస్టల్లో సంఘటన చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన సతీష్ నెల రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. విజయవాడలోని లయోలా కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరంలో సతీష్ (21) చదువుతున్నాడు. అశోక్ నగర్‌లోని లక్కీ బాయ్స్ హాస్టల్‌లో స్టే చేస్తున్నాడు. గత ఐపీఎల్‌లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడ్డాడు.

కొంతవరకు లాభం వచ్చినప్పటికీ తిరిగి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. నష్టాలను పుడ్చుకునేందుకు అందిన చోటల్లా అప్పులు చేశాడు. సతీష్ చేసిన అప్పుల గురించి కుటుంబ సభ్యులకు తెలిసి కొంతవరకు తీర్చారు. అయినప్పటికీ కూడా సతీష్ అప్పులు తీరలేదు. నెలరోజుల క్రితమే సతీష్‌ విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చాడు. గత నెల రోజుల నుంచి లక్కీ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఒకవైపు అప్పల బాధ, మరొకవైపు మానసిక ఒత్తిడి.. ఈ సంఘర్షణలో సతీష్ హాస్టల్ లోనే ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే చిక్కడపల్లి పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సతీష్ మృతదేహాన్ని స్వాధీనపరచుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సతీష్ మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు తెలియజేశారు.

Next Story