మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘోరం జరిగింది. తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇవాళ వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కట్టెల కోసం వెళ్లిన తల్లికూతురు ఇంటికి తిరుగుపయనం అయ్యారు. తల్లి ముందు నడుస్తుండగా.. ఆ బాలిక కాస్త వెనుకబడింది. అదే సమయంలో పొదల చాటున దాక్కున్న అదే గ్రామానికి చెందిన బాలుడు.. బాలికను పొదల్లోకి లాగాడు. ఆపై బాలిక నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఒడిగట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
చిన్నారి నడిచేందుకు ఇబ్బంది పడటం, కడుపు నొప్పి అని చెబుతుండటంతో బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. వెంటనే తల్లిదండ్రుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. దేశంలో ఇలాంటి కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా, కొత్త చట్టాలు తెస్తున్నా.. కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. ఆడది కనిపిస్తే చాలు మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. చిన్నా పెద్దా, ముసలి ముతక అనే తేడా లేకుండా కామా పిశాచుల్లా ప్రవర్తిస్తున్నాయి.