ఉత్తరప్రదేశ్లోని ఓ కాలేజీ హాస్టల్లో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. బులంద్షహర్లోని దిబాయిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని హాస్టల్లో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులందరినీ అలీఘర్లోని ఉన్నత వైద్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంలో విద్యార్థులతో పాటు ముగ్గురు క్యాంటీన్ కార్మికులు కూడా తీవ్రంగా కాలిన గాయాలయ్యారని, ఆహారం వండుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బులంద్షహర్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. హాస్టల్ వంటగదిలో సిలిండర్ పేలింది. ఘటన సమయంలో వంటగదిలో ఉన్న వారందరికీ కాలిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. పేలుడు ఘటనలో గాయపడిన విద్యార్థులంతా 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయసువారే. ఘటన సమయంలో హాస్టల్లో దాదాపు 55 మంది విద్యార్థులు ఉన్నారు. అగ్నిమాపక యంత్రం సంఘటనా స్థలానికి చేరుకుంది. మంటలను ఆర్పడానికి రెండు గంటల సమయం పట్టింది. మంటలు వంటగది, సంస్థలోని ప్యాంట్రీ ప్రాంతాన్ని కూడా ధ్వంసం చేసింది. జిల్లా మేజిస్ట్రేట్ చంద్ర ప్రకాష్ సింగ్, ఎస్ఎస్పీ గాయపడిన వారికి ఉచిత చికిత్స ప్రకటించారు.