ఎలుకను చిత్రహింసలకు గురిచేసి చంపిన వ్యక్తికి జైలు శిక్ష
10 hours in jail for torturing mouse to death in UttarPradesh. జంతు కార్యకర్త ఎలుకను చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను చిత్రీకరించడంతో 34 ఏళ్ల వ్యక్తిని
By అంజి Published on 27 Nov 2022 2:26 PM IST
జంతు కార్యకర్త ఎలుకను చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను చిత్రీకరించడంతో 34 ఏళ్ల వ్యక్తిని పోలీసుల అదుపులో తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో జరిగింది. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై తదుపరి విచారణ జరుగుతోందని పోలీసు అధికారులు చెప్పారు. దీంతో సదరు వ్యక్తి మనోజ్ కుమార్ 10 గంటలపాటు పోలీసు కస్టడీలో గడపవలసి వచ్చింది. అయితే ఎలుకలు 'జంతువుల' పరిధిలోకి రానందున జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ఈ కేసులో వర్తించదని సర్కిల్ అధికారి అలోక్ మిశ్రా తెలిపారు.
"మేము ఈ విషయంలో న్యాయ అభిప్రాయాన్ని కోరాము. తదనుగుణంగా చర్యలు తీసుకుంటాము" అని అతను చెప్పారు. జంతు కార్యకర్త వికేంద్ర శర్మ ఫిర్యాదు చేశారని, తన పిల్లల సమక్షంలో ఎలుకను చిత్రహింసలకు గురి చేసి చంపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు అధికారి తెలిపారు. ''నిందితుడు ఎలుకను దాని తోకకు రాయి కట్టి డ్రెయిన్ నీటిలో ముంచి చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు నేను చూశాను. అతనిని ప్రశ్నించగా, మనోజ్ కుమార్ ఇలా మళ్లీ చేస్తానని సమాధానమిచ్చాడు'' అని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఫిర్యాదుదారుడు ఎలుకను రక్షించడానికి ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. ఆసక్తికరంగా, చనిపోయిన ఎలుకను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం కోసం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అయితే పశువైద్యశాలలోని సిబ్బంది శవపరీక్ష నిర్వహించడానికి నిరాకరించారు. ఆ తర్వాత చనిపోయిన ఎలుకను బదౌన్కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలోని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IVRI)కి పంపారు. శవపరీక్ష నివేదికను వెనక్కి పంపేందుకు ఐవీఆర్ఐ అధికారులు వారం రోజుల సమయం కోరినట్లు మరో పోలీసు అధికారి తెలిపారు. చనిపోయిన ఎలుకల పరీక్షకు చెల్లించాల్సిన రూ.225ను ఫిర్యాదుదారు స్వయంగా చెల్లించారని తెలిపారు.