భారత్‌లో కోలుకున్న 37లక్షల మంది కరోనా బాధితులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2020 5:32 AM GMT
భారత్‌లో కోలుకున్న 37లక్షల మంది కరోనా బాధితులు

భార‌త్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా నిత్యం 90వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 94,371 కేసులు నమోదు అయినట్లు కేంద్ర, వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 47,54,357కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 37,02,596 కోలుకోగా.. 9,73,175 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్క రోజే 1,114 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 78,586కు పెరిగింది.

దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.88 శాతం ఉండగా.. మరణాల రేటు 1.65శాతంగా ఉంది. కాగా.. కరోనాతో చనిపోతున్న వారిలో దాదాపు 70 శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. నిన్న ఒక్కరోజులోనే 10,71,702 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 5,62,60,928 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే ఇండియా మొదటి స్థానానికి చేరతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story