ఆ రాష్ట్రంలో విదేశీయులకు నో ఎంట్రీ
By అంజి Published on 8 March 2020 10:00 AM GMTప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 97 దేశాల్లో 1,02,180 మందికి కరోనా వ్యాపించగా, ఇప్పటికే 3,500 మందికిపైగా ఈ వైరస్ వల్ల చనిపోయారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్లోని అన్ని రాష్ట్రాలను ఈ వైరస్ భయపెడుతుంది. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ ఉధృతి పెరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారు.
ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వైరస్ సోకకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలని, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి వంటి వాటిపై ప్రజల్లో విస్తృత అవగహన కల్పిస్తున్నారు. ఇదే క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ రాష్ట్రంలోకి రాకుండా సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి వచ్చేవారి వల్లనే కరోనా వైరస్ వ్యాపిస్తుందని భావించిన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోకి విదేశీయుల రాకను నిలిపివేస్తుంది.
Also Read:
కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి సోకిన కరోనా
ఆ రాష్ట్రంలో పర్యటించాలనుకునే విదేశీయులకు ఇచ్చే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్స్ (పీఏపీ) లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పీఏపీ ఇష్యూయింగ్ అథారిటీలకు ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున విదేశాల నుంచి వస్తున్న వారి వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నదనే ఈ నిర్ణయం తీసుకున్నామని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.