తెలంగాణలో 'కరోనా'.. భయాందోళనలో ప్రజలు
By సుభాష్ Published on 2 March 2020 11:54 AM GMTముఖ్యాంశాలు
తెలంగాణలో తొలి కరోనా వైరస్ కేసు నమోదు
ఢిల్లీలో మరొకరికి
స్పష్టం చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
భయాందోళనలో తెలంగాణ ప్రజలు
అప్రమత్తమైన ప్రభుత్వం
ఎలాంటి ఆందోళన చెందవద్దు: మంత్రి ఈటెల రాజేందర్
చైనాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా దేశాలను వణికిస్తున్నకరోనా వైరస్ ఇప్పుడు భారత్లోకి చొచ్చుకొచ్చింది. ఇప్పటి వరకు భారత్లో కరోనా వైరస్ అనుమానితులుగా గుర్తించి చికిత్స అందిస్తున్నారు తప్ప.. ఖచ్చితంగా కరోనా వైరస్ సోకినట్లు ఎవరు కూడా నిర్ధారించలేదు. తాజాగా భారత్లో రెండు కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అలాగే అలాగే తెలంగాణలో ఒక కేసు, ఢిల్లీలో ఒక కేసు నమోదైనట్లు తెలిపింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకగా, మరో వ్యక్తి ఇటలీ నుంచి ఢిల్లికి వచ్చిన వ్యక్తికి కరోనా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది. కాగా, కరోనా సోకిన ఇద్దరు వ్యక్తులను ప్రస్తుతం ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆరోగ్యశాఖ తెలిపింది.
హైదరాబాద్లో కరోనా కేసుతో తెలంగాణ సర్కార్ అప్రమత్తం
హైదరాబాద్లో కరోనా కేసు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ప్రజలు ఎలాంటి భయాందోలన చెందవద్దని తెలంగాణా ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. కరోనాపై వైద్యాధికారులు, సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందు జాగ్రత్తగానే ఎయిర్పోర్టులో అనుమానితులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కరోనా సోకిన వ్యక్తి దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడంతో ఐసోలేషన్ వార్డులలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తించిన తర్వాత రాష్ట్రంలో తగు చర్యలు చేపట్టారని తెలిపారు.
ప్రజలు ఆందోళన చెందవద్దు
తెలంగాణలో కరోనా తొలి కేసు నమోదు కావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా, కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి ఈటెల సూచించారు. చైనాలో కరోనా వ్యాపించినప్పటి నుంచి ఆ వైరస్ రాష్ట్రంలోకి రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరికి కూడా కరోనా లేదని, ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి దుబాయ్ నుంచి హైదరాబాద్కు రావడంతో కరోనా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే అధికారులను, వైద్యాధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటెల ఆరోగ్య సిబ్బందితో సమావేశం కానున్నారు.
66 దేశాలకు పాకిన 'కరోనా'
ఈ కరోనా వైరస్ చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 66 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన 3 వేలకు పైగా మృతి చెందగా, 88వేల 257 మందికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. మృతుల్లో 2వేల 870 మంది చైనాకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. ఒక్క రోజు వ్యవధిలోనే 2వేల 338 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.