క్వారంటైన్‌ నుంచి పారిపోయాడు.. ఐదుగురికి కరోనా అంటించాడు

By సుభాష్  Published on  28 March 2020 9:54 AM GMT
క్వారంటైన్‌ నుంచి పారిపోయాడు.. ఐదుగురికి కరోనా అంటించాడు

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తుండటంతో కేసుల సంఖ్య అధికంగా నమోదవుతున్నాయి. ఈ వైరస్‌ వల్ల ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో మరణించగా, లక్షల్లో చికిత్స పొందుతున్నారు. ఇక భారత్‌లో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 800పైగానే ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 59కి చేరింది.

అయితే ఓ యువకుడు బ్రిటన్‌లో చదువుకుని ఇటీవల భారత్‌కు వచ్చాడు. అప్పటికే ప్రపంచాన్ని కరోనా గజగజ వణికిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సదరు యువకుడికి కూడా పరీక్షలు నిర్వహించగా, కరోనా లక్షణాలున్నట్లు వెల్లడైంది. వెంటనే అతన్ని ఢిల్లీలోని క్వారంటైన్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, నిబంధనలను తుంగలో తొక్కి, అధికారుల కళ్లుగప్పి అక్కడి నుంచి పారిపోయాడు. తీరా ఆ యువకుడు వెస్ట్‌ బెంగాల్‌కు చేరుకున్నాడు. తర్వాత ఓ శుభకార్యానికి హాజరయ్యాడు. ఇక ఫంక్షన్‌లో పాల్గొన్న ఆ యువకుడి కారణంగా 27 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలున్నట్లు బయటపడింది. అందులో 9 నెలల చిన్నారి, 6 సంవత్సరాల కుమారుడు, 45 ఏళ్ల మరో మహిళ, ఆమె కుమారుడు (11) కూడా ఉన్నారు. దీనికంతటికి కారణం ఆ యువకుడే. సదరు కుటుంబాన్ని ఈనెల 23వ తేదీ నుంచి క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఇక యువకుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు అతన్ని పట్టుకుని నిర్బంధంలోకి నెట్టారు. యువకుడి కారణంగా మరెంత మందికి కరోనా సోకిందనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు.

Next Story