కన్నీటిని తెప్పించే కరోనా కథ.. ఈ కథ వెనుక మరో కథ

By సుభాష్  Published on  28 March 2020 7:17 AM GMT
కన్నీటిని తెప్పించే కరోనా కథ.. ఈ కథ వెనుక మరో కథ

కరోనా వైరస్‌.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్‌ దేశ దేశాలను కన్నీటిని పెట్టిస్తోంది. సరైన మెడిసిన్‌ లేక నివారణే ఒక్కటే మార్గంగా ప్రజలు పడరాని అవస్థలు పడుతున్నారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ పేరుతో ఎవ్వరు కూడా బయటకు రాలేని పరిస్థితి. ఇక ప్రజల బాధ అలా ఉంటే వైద్యుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ప్రాణాలు సైతం ఫణ్ణంగా పెట్టుకుని కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి వైద్యం చేస్తున్నారు డాక్టర్లు. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇటలీ దేశంలో మరణాలు అధికంగా సంభవించడంతో మార్చురీలలో క్యూ కట్టిన వేల శవాలే సాక్ష్యం.

సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కథనం..

ఈ ఫోటో చూశారా..? ఏం కనిస్తోంది.. గేటు దగ్గర ఓ వ్యక్తి ఎదురుగా నిలబడి ఇద్దరు పిల్లలు, మరో ఫోటోలో ఇద్దరు భార్యభర్తలు కనిపిస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఎంత ముద్దుగా కనిపిస్తున్నారో. మరీ ఆ గేటు దగ్గర నిల్చున్న వ్యక్తి ఎవరు..? ఎందుకు నిల్చున్నాడు..? ఇక పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.

అసలు విషయం ఏంటంటే.. గేటు ముందు నిల్చున్న వ్యక్తి పేరు డాక్టర్‌ హైడియో అలా. ఇండోనేషియాలోని జకార్తాలో ఓ ప్రముఖ వైద్యుడు. ఇతను కరోనా రోగులకు చికిత్స చేసి చేసి.. ఆయనకూ కరోనా సోకేసింది. వేలాది మందికి చికిత్స చేసిన ఆ డాక్టర్‌ ను కరోనా వైరస్‌ వెంటాడటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ కరోనా మహమ్మారి బారిన వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. తాను కూడా చనిపోతానేమోనని అనుకున్నాడేమో.. పిల్లలు గుర్తుకొచ్చారు. భార్య గుర్తుకు వచ్చింది. ఆస్పత్రి నుంచి ఇంటికెళ్లి పిల్లలనూ.. భార్యను గట్టిగా కౌగిలించుకుని మనసారా ఏడ్వాలని ఉంది. కానీ దగ్గరకు వెళ్లి తాకితే ఆ మాయదారి రోగం వాళ్లకు అంటుకుంటుందేమోనన్న భయ. తన చేతులతోనే తనే చంపేస్తానేమోనని బాధ. కరోనా పాజిటివ్‌ వచ్చినా.. వాళ్లకు చెప్పకుండా బాధను దిగమింగుకుని తన మనసులోని ఉంచుకున్నాడు.

అందుకే చివరిసారిగా పిల్లలను, భార్యను చూసి వద్దామని అనుకుని ఇంటి గేటు వరకు వెళ్లాడు. తన పిల్లలనూ, భార్యను చివరి సారిగా చూసుకున్నాడు. ఆయన కళ్లలో బాధ.. వాళ్ల ముందు ఏడ్వలేని పరిస్థితి... పైగా డాక్టర్‌ భార్య గర్భణి. ఎంతో బాధతో చివరి సారిగా చూస్తూ, తిరిగి ఆస్పత్రికి వెళ్లిపోయాడు. కాగా, ఈ ఫోటో ఆయన భార్య తీసిందే. కానీ ఆమెకు తెలియదు తన భర్త దేశం కోసం, రోగుల కోసం తన ప్రాణాలనే బలిపెట్టుకుంటున్నాడని. ఇలాంటి వైద్యులు ఎంతో మందికి ప్రాణాంతకమైన వ్యాధి వచ్చినా.. ఏ మాత్రం వెనుకాడకుండా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. వైద్యుడా నీకు వందనం..తండ్రిగా, ఒక భర్తగా మరీ వందనం.

Corona Fake News 2

ఈ స్టోరీ చదువుతుంటే మనకు కూడా ఏడుపు వచ్చేలా ఉంది కదూ. నిజానికి కరోనా వచ్చిననాటి నుంచి ఇలాంటి కథనాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం మనసును పిండేసే కథనం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అసలేం జరిగిందంటే..

ఈ కథనానికి సంబంధించిన ఫోటోను అహ్మద్‌ ఎఫెండీ అనే మలేషియన్‌ తన ఫేస్‌బుక్‌ లో షేర్‌ చేశాడు. పైగా వీరి గురించి కూడా తెలియజేశాడు. మీరు ఇళ్లలో పిల్లలతో ఆడుకుంటూ ఉంటే .. వైద్యులు తమ పిల్లలకు దూరంగా ఉంటూ ఆస్పత్రుల్లో మీ కోసం పని చేస్తూనే ఉన్నారు. వాళ్ల త్యాగాలను గుర్తించండి.. ఇదిగో మా కజిన్‌ ఓ డాక్టర్‌ బయటి నుంచి వీడ్కోలు చెబుతూ డ్యూటీకి వెళ్తున్నాడూ చూడండి.. అనే సారాంశం వచ్చేలా తన ఫేస్‌ బుక్‌లో ఈ ఫోటోను షేర్‌ చేసిన అహ్మద్‌ ఎఫెండీ. అంతేకాదు ఈ ఫోటోను షేర్‌ చేస్తూ తన టీమ్‌కు అసలు విషయం చెప్పాడు.

నిజానికి ఈ ఫోటోను ముందు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ కొన్ని విషయాలను వెల్లడించాడు. ''మీరు ఇళ్లల్లో హాయిగా ఉండి పిల్లలతో ఆడుకుంటూ ఉంటే వీధుల్లో, ఆస్పత్రుల్లో ఎంతో మంది తమ పిల్లలకు దూరంగా ఉండి ప్రజల కోసం పని చేస్తూనే ఉన్నారు. వాళ్ల త్యాగాలను గుర్తించండి. ఇదిగో మా కజిన్‌. ఓ డాక్టర్‌ బయటి నుంచి వీడ్కోలు చెబుతూ తన విధులు నిర్వర్తించేందుకు వెళ్తున్నాడు'' అన్నట్లు చెప్పుకొచ్చాడు అహ్మద్‌ ఎఫెండీ.

Corona Fake News 1

అయితే తన చివరి ఫోటో కదా.. కరోనా వైరస్‌ సోకిందని, ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు అనే కథనాలు వచ్చాయి కాదా.. మరి తర్వాత కథనాలు వేరేలా కనిపిస్తున్నాయి ఏమిటీ..? అని కొందరు అడిగితే.. అతను చెప్పిన అసలైన సమాధానం ఏంటంటే.. '' ఆ డాక్టర్‌ మా కజినే. తనది అసలు ఇండోనేషియా కాదు. మలేషియా. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడు. కరోనా సోకలేదు. కరోనా రోగుల చికిత్సలో ఉన్నాడు. దేవుడి దయవల్ల ఆయన, ఆయన భార్య, పిల్లలూ క్షేమంగానే ఉన్నారు'' అని సమాధానం ఇచ్చాడు.

అయితే విషయం ఏమిటంటే.. ఈ మంచి ఫోటోను కూడా కొందరు ఫేక్‌ పోస్టుల కోసం వాడుకున్నారు. ఇలాంటి దుర్మార్గమైన పోస్టు ఏదైనా ఉందంటే ఈ ఫోటోతో ఉన్న పోస్టుమాత్రమే. ఆయనకు కరోనా సోకలేదు. ప్రజల కోసం తన భార్య, పిల్లలనూ వదిలి ప్రజల ప్రాణాల కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పని చేస్తున్నాడని ఈ పోస్టు సోషల్‌ మీడయాలో పోస్టు చేస్తే.. కొందరు ఆఫోటోను ఫేక్‌ ఫోటోగా వాడుకుని నిజాంగానే ఆయన కరోనా సోకిందని, కుటుంబంతో చెప్పలేకి దిగమింగుకున్నాడని కొందరు రాశారు. ఈ ఫోటోతో వచ్చిన ఫేక్‌ వార్తలను చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.



Next Story