కరోనా సోకొవద్దని దేవుడికి మాస్క్.. నిలదీసిన భక్తులు
By అంజి Published on 10 March 2020 8:35 AM GMTముఖ్యాంశాలు
- వారాణాసిలో విశ్వనాథ్ ఆలయంలో కరోనా భయం
- కరోనా సోకుతుందని దేవుడి విగ్రహానికి మాస్క్ కట్టిన పూజారి
- ప్రజల్లో అవగహన కల్పించేందుకే అంటూ వ్యాఖ్య
కరోనా వైరస్ సోకుతుందని దేవుడి విగ్రహానికి ఓ ఆలయ పూజారి మాస్క్ కట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో గల విశ్వనాథ్ ఆలయంలో చోటు చేసుకుంది. కాగా శివుడి విగ్రహానికి మాస్క్ కట్టడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంలో జీవం పుట్టుక దేవుడి వల్లే జరిగిందని భక్తుల నమ్మకం.. అలాంటిది దేవుడికే కరోనా వైరస్ సోకుతుందని భయపడడం కొందరికి తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక్కడ దేవుడిని తాకుకుండా ఉండేందుకు పూజారి భక్తులకు షరతులు విధించాడు. దేవుడిని తాకితే కరోనా సోకుతుందన్న ఆలయ పూజారి షరతుపై పలువురు భక్తులు మండిపడుతున్నారు.
ప్రజల్లో కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు ఇలా చేస్తున్నామని ఆలయ పూజారి తెలిపారు. ప్రజలు విగ్రహాన్ని తాకితే వైరస్ వ్యాపిస్తుందని, ఎక్కువ మందికి వ్యాధి సోకుతుందని పూజారి తెలిపారు. ఆలయంలో పూజారి, భక్తులు ఫేస్ మాస్క్లు ధరించి పూజలు చేయడం ఫొటోల్లో కనిపించింది.
Also Read: కరోనా పై అధికారులను హెచ్చరించిన కిమ్
ఇలా దేవుడికి మాస్క్ కట్టిన కొన్ని ఫొటోలను భక్తులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టుపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు ఇంత అజ్ఞానంలో బతకడమేంటని పలువురు మండిపడుతున్నారు. కాగా ఈ సంఘటన అంత అసాధారణమైనది కాదని ఆలయ పూజారి ఆనంద్ పాండే వార్త సంస్థ ఏఎన్ఐకి చెప్పారు. తాము విగ్రహాలకు చల్లగా ఉన్నప్పుడు బట్టలు వేసి.. వేడిగా ఉన్నప్పుడు ఏసీని వేస్తామని.. ఇప్పుడు కూడా కరోనా వైరస్ వ్యాపించకుండా మాస్క్లు వేశామని తెలిపారు.