భారత్లో కరోనా విజృంభణ.. 20వేలకు చేరువగా
By తోట వంశీ కుమార్ Published on 22 April 2020 7:45 AM GMTభారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,300 కొత్త కేసులు నమోదు కగా.. 50మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో కలిసి బుధవారం ఉదయానికి కరోనా కేసుల సంఖ్య 19,984కి చేరింది. ఇక మహమ్మారితో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 640కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా.. మొత్తం కేసుల్లో ఇప్పటి వరకు 3870 మంది కోలుకుని ఆస్పత్రిని నుంచి డిశ్చార్జి అయ్యారని ప్రకటించింది. కరోనా బారీన పడి కోలుకుంటున్న వారి శాతం 19.36 గా ఉంది.
ఇక దేశంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు మహరాష్ట్రలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో 5,218 కేసులు నమోదు కాగా.. 251 మంది మృత్యువాత పడ్డారు. గుజరాత్లో ఈ మహమ్మారి బారీన పడి 90 మంది మృత్యువాత పడగా.. 2178 కేసులు నమోదయ్యాయి. ఢిల్లిలో 2,156 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 47 మంది మరణించారు. మధ్యప్రదేశ్లోనూ 76 మంది మరణించగా.. 1,552 కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తంలో ఏడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో 928 కేసులు నమోదు కాగా.. 23 మంది మరణించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో 813 కేసులు నమోదు కాగా..24 మంది మృతి చెందారు.