భారత్‌లో కరోనా రికార్డులు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Sep 2020 6:04 AM GMT
భారత్‌లో కరోనా రికార్డులు..

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 97,570 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,59,985కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 36,24,196 మంది కోలుకోగా.. 9,58,316 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

నిన్న ఒక్క రోజే 1,201 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 77,472 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 77.77శాతం ఉండగా.. మరణాల రేటు 1.66శాతంగా ఉంది. నిన్న ఒక్క రోజే 10,91,251 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. మూడో స్థానంలో బ్రెజిల్‌ ఉంది.

Next Story