భారత్లో 39లక్షలు దాటిన కరోనా కేసులు
By తోట వంశీ కుమార్ Published on 4 Sep 2020 4:44 AM GMTభారత్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 39లక్షల మార్కును దాటింది. గడిచిన 24గంటల్లో 83,341 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,096 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 39,36,748కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 30,37,152 కోలుకున్నారు. 8,31,124 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి 68,472 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న 11,69,765 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 4,66,79,145 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. 63,35,244 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 40,46,150 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక భారత్లో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. మరికొద్ది రోజుల్లోనే భారత్ రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.