భారత్‌లో 30వేలు దాటిన కరోనా మరణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 July 2020 5:39 AM GMT
భారత్‌లో 30వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 49,310 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 740 మంది మరణించారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తరువాత ఒక రోజు వ్యవధిలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే. వీటితో కలిపి దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 12,87,945కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 30,061 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 8,17,209 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,40,135 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 63.18శాతంగా ఉంది. దేశంలో మొత్తం 1,54,28,170 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో 3,52,801 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో 41లక్షల పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 12లక్షల కేసులతో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి చేరింది.

Next Story