సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  9 Jun 2020 10:01 AM GMT
సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్

కరోనా.. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న మ‌హ‌మ్మారి. కంటికి క‌నిపించ‌కుండా‌ చాపకింది నీరులా విస్తరిస్తుంది. దీంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బ‌య‌ట‌కు వెళ్లాలన్నా, ప‌క్క‌వారితో మాట్లాడాలన్నా ఎట్నుంచి లంటుకుంటుందోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నారు.

అయితే.. ఈ భయంకరమైన వైర‌స్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనటానికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్ర‌వేత్త‌లు కృషిచేస్తున్నారు. అయితే.. ఆక్స్‌ప‌ర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధనా బృందం వ్యాక్సిన్‌ను కనుగునే విష‌య‌మై ఒక అడుగు ముందుగానే ఉంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ను మ‌నుషుల‌పై పరిశోధన ట్రయల్స్ కొనసాగుతూనే ఉంది.

అయితే సెప్టెంబర్‌ కల్లా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానున్నాయ‌ని.. అలాగే 2021 జూన్ కల్లా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో తీసుకుని రానున్న‌ట్లు తయారీ, మార్కెటింగ్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా అధికారికంగా వెల్లడించింది. ఏజెడ్‌డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్‌ తయారీని ప్రారంభించామని, అన్ని పరీక్షలు ఆగస్టు నాటికి విజయవంతంగా పూర్తయ్యి.. మార్కెట్లో వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.

ఇదిలావుంటే.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ త‌యారుచేస్తున్న‌ ఈ వ్యాక్సిన్ 18–55 ఏళ్ల వ‌య‌సున్న ఆరోగ్య‌క‌ర‌మైన వాలంటీర్ల‌ను ప్రయోగించింది. దీంతో తొలిదశ ట్రయల్స్‌ విజయవంతం అయినట్టు ప్రకటించడంతో ప్రజలలో ఆశలు చిగురించాయి. అయితే ప్రస్తుతం రెండో దశ ప్రయోగం చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే నిర్వహించేందుకు సదరు సంస్థ సిద్ధమైంది.

ఇందుకు గాను 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారిపై ప్రయోగాలు ఆగస్టు నాటికి సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని, వెంటనే వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇదిలావుంటే ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. బ్రిటన్‌, భారత్, నార్వే, స్విట్జర్లాండ్‌ దేశాల్లో వ్యాక్సిన్‌ తయారీని ప్రారంభించనుంది. భారత్ లో‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం.

Next Story