కరోనా వైరస్ రెండో దశపై ఊహాగానాలు - మరికొంతకాలం కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 2:26 AM GMT
కరోనా వైరస్ రెండో దశపై ఊహాగానాలు - మరికొంతకాలం కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసుల సంఖ్య మనదేశంలో తగ్గుముఖం పడుతోంది. అయితే ఇతర దేశాల్లో మాత్రం కేసుల సంఖ్య పెరుగడమే కాకుండా ఫ్రాన్స్, జర్మనీలో మరోసారి లాక్ డౌన్ విధించారు. ఈ పరిస్థితుల్లో మన దేశంలోనూ కరోనా రెండో దశ ప్రభావం ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది. కొంతమంది వైద్యనిపుణులు కూడా దీన్ని కొట్టిపారేయలేమని చెబుతున్నారు.

కరోనా రెండో దశ మళ్లీ మొదలవుతుందన్న ప్రచారం నేపథ్యంలో ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా కేసులు పెరిగినా, పెరగకపోయినా మరికొంతకాలం కనీస జాగ్రత్తలు మాత్రం తీసుకావాల్సిందే.

దీనికి తోడు రాష్ట్రంలో సోమవారం నుంచి 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. కాబట్టి మన ప్రవర్తనా శైలిని మార్చుకుందాం. కరోనాపై యుద్ధంలో విజయం సాధించేందుకు ఈ కింద ఇవ్వబడిన జాగ్రత్తలు తీసుకుందాం.

* కరోనా వైరస్ దానంతట అదే ఆగిపోదు. ఆ వైరస్ వ్యాప్తిని నివారించడమే మనముందున్న మార్గం. ఇందుకు కరోనా నివారణ పద్ధతులను తప్పక పాటించాలి.

* కరోనా వైరస్ ప్రభావం ఉన్నంతకాలం ఈ మూడు సూత్రాలు తప్పకపాటించాలి. అందులో

బయటికి వెళ్లిన ప్రతిసారి ముఖానికి మాస్కు ధరించడం. మీరు మాస్కు ప్రతిరోజూ ధరిస్తున్నారా? మీ ఎదుటివ్యక్తులు కూడా మాస్కు ధరించాలని సూచించండి. ఇతరులతో కనీసం 6అడుగుల భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను సబ్బు, నీటితో లేదా శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.

* ఒకవేళ తుమ్ము లేదా దగ్గు వచ్చినట్టయితే తప్పకుండా మీ మోచేతిని ముక్కుకు అడ్డుపెట్టుకుని లేదా చేతి రుమాలును, టిష్యూ పేపర్ ను అడ్డుపెట్టుకోవాలి. ఆ తర్వాత చేతిని శుభ్రం చేసుకోండి. టిష్యూ అయితే జాగ్రత్తగా పారవేయాలి.

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కూడా కరోనా వైరస్ వ్యాప్తించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. ప్రజలు కూడా దీన్ని తప్పక పాటించాలి.

* కరోనా కాలంలో అవసరం లేకపోయినా బయటకు వెళ్లడం మానుకోవాలి. అత్యవసరమైతేనే బయటకు వెళ్లండి. అంతేకాకుండా మీ ఇంట్లో ఉండే వృద్ధులను మరింత జాగ్రత్తగా చూసుకోండి. శ్వాసకోస సంబంధమైన వ్యాధులతో బాధపడేవారిని, గర్బిణీలను, 10ఏళ్లలోపు పిల్లలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

* ఇప్పుడు పండగల సీజన్ కావడంతో మరింత జాగ్రత్గా ఉండాల్సిన అవసరం ఉంది. మీ ఆరోగ్యం సహకరించకపోవడం లేదా అస్వస్థగా అనిపించినా ఎలాంటి వేడుకలకూ హాజరు అవకండి. ఇంట్లోనే ఉండడంతోపాటు మీ అనారోగ్య పరిస్థితులను వీలైనంత త్వరగా రాష్ట్ర లేదా జిల్లా కేంద్రంలో ఉండే కాల్ సెంటర్ కు లేదా స్థానికంగా ఉండే ఆరోగ్యశాఖ సిబ్బందికి తెలియజేయండి.

* మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా వేడుక, ప్రదర్శన లేదా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ లేదా పాల్గొనాల్సి ఉంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. మీ శరీర ఉష్ణోగ్రతలను తరచూ పరీక్షించుకోండి. ఇతరులతో భౌతిక దూరం పాటించండి. చేతులను తరచూ శుభ్రం చేసుకోండి.

* ఇకవేళ ఏదైనా సామాజిక కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టయితే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా సమవేశ గదుల్లో 50శాతం ప్రేక్షత సామర్థ్యం మించకుండా, గరిష్టంగా 200 మందికి లోబడిన పరిమితితో మాత్రమే అనుమతించబడుతుంది.

* మన అందరం కరోనా వైరస్ ను వ్యాప్తిని నిరోధించే పద్ధతులను పాటించాలి. కరోనాపై చేస్తున్న యుద్ధంలో విజయం సమన్వయంతోనే జాగ్రత్తలు పాటిస్తూ సాధించగలము.

Next Story