ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎస్ఎంఎస్ ద్వారా కరోనా ఫలితం
By న్యూస్మీటర్ తెలుగు Published on 10 Jun 2020 6:28 PM ISTఏపీ ప్రభుత్వం కరోనా టెస్టుల ఫలితాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ టెస్ట్ రిజల్ట్స్ వెల్లడించే విధానంలో లోపాలు తలెత్తుతుండటంతో.. సంబంధిత వ్యక్తి ఫోన్ నెంబర్కు కరోనా టెస్టుల ఫలితాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపే విధంగా చర్యలు చేపట్టింది.
మాములుగా అయితే.. కరోనా పరీక్షల చేయించుకున్న తర్వాత ఫలితాలు వచ్చేందుకు రెండు రోజుల సమయం పడుతుంది. ఆ ఫలితాలను ఆన్లైన్ ద్వారా వైద్యులు, ఆసుపత్రి సూపరిటెండెంట్లకు తెలియజేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి.
దీంతో ఆ తప్పులను అధిగమించడం కోసమే కరోనా టెస్ట్ ఫలితాలను నేరుగా పరీక్షలు చేయించుకున్న వ్యక్తి సెల్ఫోన్కే మెసేజ్ ద్వారా అందజేయనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. అంతేకాకుండా.. వైద్య ఆరోగ్యశాఖ పంపే లింకు ఆధారంగా కరోనా ఫలితాన్ని కూడా చూసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కొత్త విధానాన్ని మంగళవారం నుంచి అమలులోకి తీసుకొచ్చారు.