ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యక్తికి కరోనా పాజిటివ్‌

By Newsmeter.Network  Published on  7 April 2020 8:29 AM GMT
ఎలాంటి లక్షణాలు లేకుండానే వ్యక్తికి కరోనా పాజిటివ్‌

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువవుతున్నాయి. రోజుకు పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం, వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఖమ్మంలో ఓ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేకుండా కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. జిల్లాలోని ఖమ్మం రూరల్‌ మండలం పెద్దతండాకు చెందిన వ్యక్తికి పరీక్ష నిర్వహించగా వైరస్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు.

Also Read :కరోనా ఎఫెక్ట్‌.. కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థ.. ఎంతగా అంటే..

ఇదిలాఉంటే గతవారం రోజులగా ఆ వ్యక్తిని కలిసిన పలువురిని సైతం గుర్తించిన అధికారులు వారికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. పెద్దతండాలో కరోనా సోకిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ అని నిర్దారణ అయినట్లు వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఏమీ అతనికి లేవని, టీబీ పేషెంట్‌ కావడంతో వైద్యులు అప్రమత్తంగా ఉండి చికిత్స చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే ఢిల్లి మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారిని ఐసోలేషన్‌లో పర్యవేక్షణలో ఉంచామని మంత్రి తెలిపారు.

Also Read :హాట్‌స్పాట్లపై డేగకన్ను.. కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఇదిలాఉంటే ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్‌ రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల చైనాలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. వైరస్‌ పుట్టినట్లు పేర్కొంటున్న చైనాలోని వూహాన్‌లో ఇటీవల మళ్లి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కానీ వారిలో పలువురికి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే పాజిటివ్‌ వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. దీంతో వైరస్‌ వ్యాప్తి ఈ విధంగా కూడా ఉంటుందా అంటూ అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story