క‌రోనా కొత్త ల‌క్ష‌ణాలు.. ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Jun 2020 3:46 AM GMT
క‌రోనా కొత్త ల‌క్ష‌ణాలు.. ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరణ మృదంగం కొనసాగుతోంది. మన దేశంలోనూ రోజుకు 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి రమారమి 500 మంది కరోనా వలన మరణిస్తున్నారు. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే కరోనా పేషంట్లలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయని ఇదివరకు నిర్ధారించడం జరిగింది.

అయితే ఇప్పుడు తాజాగా కరోనా లక్షణాల్లో మరికొన్ని చేరాయి. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అనే సంస్థ కరోనా వైరస్‌ లక్షణాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వికారం లేదా వాంతులు, డయేరియా, ముక్కు కారడం కూడా కరోనా లక్షణాలే అని తెలిపింది.

కొత్తగా కనుగొన్న వాటితో కలిపి మొత్తం 11 లక్షణాలను సీడీసీ తన అధికారిక జాబితాలో చేర్చింది. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా వీటికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఈ లక్షణాలు వైరస్ సోకిన 2 నుంచి 14 రోజుల్లోపు కనిపిస్తాయని తెలిపింది.

కరోనా లక్షణాలు..

* జ్వరం

* వణుకు

* దగ్గు

* శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

* అలసట

* ఒళ్లు నొప్పులు

* తలనొప్పి

* రుచి చూడలేకపోవడం, వాసన పసిగట్టలేకపోవడం

* గొంతునొప్పి

* ముక్కు కారడం

* వికారం లేదా వాంతులు

* డయేరియా

ఎలాంటి సమయంలో వైద్య సాయం కోరాలి?

పైన కనబరిచిన లక్షణాలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలి. అదే సమయంలో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉన్నపుడు, ఛాతిలో నిరంతరం నొప్పి లేదా ఒత్తిడి అనిపిస్తున్నపుడు, ఒంట్లో సత్తువ లేకపోవడం, పెదవులు లేదా ముఖం నీలం రంగులోకి మారడం లాంటి లక్షణాలున్నపుడు వెంటనే స్థానికంగా ఉండే ఆరోగ్య సిబ్బంది లేదా వైద్యులను సంప్రదించాలి.. లేదా 104 నంబర్ కు కాల్ చేయాలని.. కోవిడ్-19 ఏపీ స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఓ ప్ర‌క‌ట‌నలో తెలియ‌జేశారు.

Next Story