విస్త‌రిస్తున్న క‌రోనా.. 'సుప్రీం'పైనా కూడా ఎఫెక్ట్‌..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 March 2020 12:49 PM GMT
విస్త‌రిస్తున్న క‌రోనా.. సుప్రీంపైనా కూడా ఎఫెక్ట్‌..!

భారత్‌లో క‌రోనా రోజు రోజుకు విజృంభిస్తుంది. నిన్న 73 ఉన్న క‌రోనా కేసుల‌ సంఖ్య నేడు 81కి చేరింది. వీరిలో 64 మంది భారతీయులు కాగా.. 16 మంది ఇటలీ పర్యాటకులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు. ఇక‌.. కేరళలో అత్యధికంగా 19 మందికి కరోనా పాజిటివ్ ఉన్న‌ట్లు నిర్ధారణ అయ్యింది.

ఇత‌ర రాష్ట్రాల‌లో చూస్తే.. మహారాష్ట్రలో 14 కేసులు నమోదు కాగా.. యూపీలో 10, ఢిల్లీ, కర్ణాటకల్లో 6 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక కేంద్ర ప్రభుత్వం మొత్తం 42,296 మంది ప్రయాణికులను కమ్యూనిటీ సర్వైలెన్స్‌లో ఉంచగా.. వీరిలో 2559 మందిలో కరోనా లక్షణాలు క‌నిపించ‌గా.. 522 మంది ప్ర‌స్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

దేశవ్యాప్తంగా క‌రోనా ఎఫెక్ట్‌తో.. కేంద్ర ప్ర‌భుత్వం ప‌లు రైళ్ల‌ను ర‌ద్దుచేయ‌గా.. క‌ర్ణాట‌క‌లో మాల్‌లు, సినిమా హాళ్లు 31 బంద్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. డిల్లీ, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు ఐపీఎల్‌ను బ్యాన్ చేయ‌గా.. కరోనా ప్రభావం సుప్రీం కోర్టుపైనా కూడా పడింది. సోమవారం నుంచి కేవ‌లం అత్యవసర కేసులను, తక్కువ బెంచ్‌లతో మాత్రమే విచారించాలని సుప్రీం నిర్ణయించింది.

Next Story