తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న కరోనా వైరస్‌

By సుభాష్  Published on  2 Jun 2020 4:03 AM GMT
తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న కరోనా వైరస్‌

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో లాక్‌డౌన్‌ 5.0 కొనసాగుతోంది. జూన్‌ 30 వరకూ కొనసాగే ఈ లాక్‌డౌన్‌లో పలు నిబంధనలు సడలిస్తూ కేంద్రం పలు మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనుమతులు ఇస్తే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు నో చెప్పింది. దీంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ 5 అమల్లోకి వచ్చింది.. జూన్ 30 వరకు కొనసాగనుంది. అలాగే కేంద్రం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయగా.. రాష్ట్రాలు కూడా మరికొన్ని సడలింపులు ప్రకటించాయి.

కాగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు రద్దీగా ఉండేవి. వేలాదిగా బస్సులు, పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగించేవి. ఇలాంటి పరిస్థితుల్లో సీన్‌ మారిపోయి చెక్‌పోస్ట్‌ లు వచ్చేశాయి. ఇప్పుడు అన్‌లాక్‌1.0లోభాగంగా అంతర్‌రాష్ట్ర ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇచ్చినా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి క్వారంటైన్‌ తప్పని సరి అని ఏపీ సర్కార్‌ స్పష్టం చేస్తోంది. తెలంగాణకు వచ్చే వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకున్నా.. ఏపీకి వెళ్లాలంటే మాత్రం ఆంక్షలు తప్పడం లేదు. ఏపీ ప్రభుత్వం పెడుతున్న ఆంక్షల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణకు ప్రయాణికులను అనుమతిస్తుండగా, పాస్‌ ఉన్నవాళ్లకే ఏపీలోకి అనుమతించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొంత రాష్ట్రానికి వెళ్లొచ్చని ఆశగా సరిహద్దుకు వెళ్లిన ఏపీకి చెందిన ప్రయాణికులు నిరాశతో మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

కాగా, ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఏపీకి రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్‌ ద్వారా ఈ-పాస్‌ తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు.

కాగా, రాష్ట్రాల నుంచి వచ్చే వారికి రైల్వే స్టేషన్‌లోనే పరిరీక్షలు నిర్వహించనుంది ఏపీ సర్కార్‌. ఆరు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి స్టేషన్‌లోనిఏ పరీక్షలు నిర్వహించి, వారం రోజులు ప్రభుత్వ ‌క్వారంటైన్‌, వారం రోజులపాటు హోం క్వారంటైన్‌ తప్పని సరిచేసింది. అయితే వృద్ధులు, చిన్నారులు, గర్బిణులకు ప్రభుత్వ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.

Next Story