యాదాద్రిలో కేసీఆర్ పర్యటన
By తోట వంశీ కుమార్
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పునరుద్ధరణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ అర్భకులు సంప్రదాయంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఆలయ ద్వారం బయట నుంచే దైవదర్శనం చేసుకున్నారు. సీఎం కేసీఆర్కు అర్చకులు చతుర్వేద ఆశీర్వచనం అందించారు. సీఎం వెంట మంత్రులు జగదీశ్వర్రెడ్డి, విప్ గొంగిడి సునీత, ఎంపీ సంతోశ్ కుమార్, ఇతర నేతలు, అధికారులు ఉన్నారు.
స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ పునరుద్దరణ పనులు సీఎం పరిశీలించారు. పనులకు సంబంధించి ఆలయ ఈవో గీత, స్థపతి ఆనంద సాయి సీఎం కేసీఆర్కు వివరించారు. ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ఆరు వరుసల రింగ్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఘాట్ రోడ్డులో మొక్కల పెంపకం పనులు కొనసాగుతున్నాయి. ఆలయ పనులు ఇప్పటికే తుదిదశకు చేరుకున్నాయి. పరిశీలన అనంతరం పనుల పురోగతిపై ఆలయ అధికారులతో సీఎం సమీక్ష జరపనున్నారు. పనుల తీరుపై అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుంది.