స్టీల్ప్లాంట్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
By Newsmeter.Network
విశాఖ స్టీల్ప్లాంట్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య కలకలం రేపింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఓ వ్యక్తి తన రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం రంపపేటవాసిగా సాధు సతీష్ గా గుర్తించారు. 2018లో అస్సాం నుంచి విశాఖ స్టీల్ప్లాంట్కు ట్రాన్స్ఫర్పై వచ్చిన సతీష్.. ప్రస్తుతం సెక్యూరిటీ విధుల్లో ఉన్నాడు.
ఇటీవలే.. 10 రోజుల సెలవుపై సొంతూరు వెళ్లాడు. మంగళవారమే డ్యూటీకి వచ్చి రిపోర్ట్ చేశాడు. విధుల్లో చేరిన కొద్ది గంటల్లోనే క్లాక్ నంబర్ 11 వద్ద తన రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యలు చేసుకున్నాడా.. లేదా.. మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.