రేపు పార్లమెంట్‌కు చిదంబరం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Dec 2019 3:14 PM GMT
రేపు పార్లమెంట్‌కు చిదంబరం..!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్ పొందిన‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్లమెంట్‌కు వస్తారని చిదంబరం కుమారుడు కార్తీ చిదంబ‌రం మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఆయన 106 రోజుల తర్వాత నేటి సాయంత్రం జైలు నుంచి బయటకు రానున్నారు. చిదంబరం ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

అస‌లేం అయ్యింది..

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ సంస్థ‌కు లబ్ధి చేకూర్చేవిధంగా విదేశీ పెట్టుబడుల ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) ఎన్నో అవకతవకలకు పాల్పడిందని సీబీఐ ఆరోపించింది. ఈ సంస్థకు పెట్టుబడులు ఆమోదించిన సమయంలో చిదంబరం ఆర్థికమంత్రిగా ఉన్నారు.

అయితే, ఈ కేసులో చిదంబ‌రం త‌న‌యుడు కార్తీ చిదంబరం, ఐఎన్‌ఎక్స్ మీడియా, ఐఎన్‌ఎక్స్ ప్రెస్ ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా ఉన్నారని సీబీఐ పేర్కొంది. ఈ కేసుకు సంబందించి ఎఫ్‌ఐఆర్‌లో చిదంబరం పేరును సీబీఐ చేర్చేలేదు.

కానీ, ఈ కేసు విచారణలో కార్తీ డబ్బులు డిమాండ్ చేశారని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ వెల్లడించినట్టు సీబీఐ వాదిస్తోంది. ఈ ఒప్పందం ఢిల్లీలోని ఒక ఫైవ్‌స్టార్ హోటల్లో జరిగిందని తెలిపారు.

Next Story