నీరవ్ మోదీపై క్రిమినల్ చార్జ్షీట్ దాఖలు..!
By సుభాష్ Published on 21 Dec 2019 12:06 PM GMTపంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ)ను రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై శనివారం క్రిమినల్ చార్జ్షీట్ దాఖలు చేసినట్లు సీబీఐ మహారాష్ట్ర స్పెషల్ కోర్టుకు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఒకరైన ఆశిష్ మోహన్భాయ్ లాడ్ ను చంపేస్తానని బెదిరించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయని సీబీఐ పేర్కొంది. 'కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ కంపెనీ డైరక్టర్లలో ఆశిష్ లాడ్ కూడా ఉన్నారు. కాగా, ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు దుబాయ్ ద్వారా కైరో వెళ్లి తలదాచుకున్నాడు. తర్వాత 2018, జూన్లో మళ్లీ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ప్లాన్చేసుకుంటున్న ఆశిష్లాడ్ ను తన సోదరుడు నేహాల్ మోదీ ద్వారా నీరవ్ మోదీ ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది.
నీరవ్ మోదీ మాట్లాడక ముందు అతని సోదరుడు నేహాల్ మోదీ ఆశికు యూరోపియన్ కోర్టులో న్యాయమూర్తి ముందు నీరవ్కు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ రూ.20 లక్షలు ఆఫర్ చేసినట్లు సమాచారం. కాగా, దీనిని ఆశిష్ లాడ్ తిరస్కరించడంతో అతన్ని చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ తెలిపింది. నీరవ్ మోదీ ప్రస్తుతం నైరుతి లండన్లో వాడ్స్ వర్త్ జైల్లో ఉన్నాడు. అతని మామ మెహుల్ చోక్సీతోకలిసి బ్యాంకుకు రూ.13,570 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలున్నాయి. కాగా, నీరవ్ మోదీని ఈఏడాది మార్చిలో స్కాట్లాండ్ పోలీసులు అరెస్టు చేశారు.