ఆ పెళ్లికి వెళ్లనీయకుండా ప్రభుత్వమే అడ్డుపడింది: చంద్రబాబు

By సుభాష్  Published on  28 Feb 2020 12:37 PM GMT
ఆ పెళ్లికి వెళ్లనీయకుండా ప్రభుత్వమే అడ్డుపడింది: చంద్రబాబు

టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు కుమారుడి పెళ్లికి వెళ్లనీయకుండా ప్రభుత్వమే అడ్డుపడిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఈ శుభకార్యానికి తప్పకుండా హాజరు కావాల్సి ఉండగా, అడ్డుపడిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు.

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత అయిన అయ్యన్నపాత్రుడు పార్టీ పట్ల, పేదల పట్ల ఎంతో నిబద్దత కలిగిన నాయకుడని, మా కుటుంబ సభ్యుల శుభకార్యం అంటే ఆయన ఇంట శుభకార్యం ముఖ్యమన్నారు. కానీ వైసీపీ పైశాచిక, శాడిస్టు మనస్తత్వంతో అరాచకంగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు. ఏపీలోవైసీపీ పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు దిగుతోందని, అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. నన్ను అడ్డుకోవడానికి వైసీపీ నేతలెవరని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కాగా, నిన్న కూడా విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీఐపీ లాంజ్‌కు తీసుకెళ్లారు. ఈ మేరకు వెనక్కి పంపడానికి గల కారణాలను తెలుపుతూ చంద్రబాబుకు లేఖ అందజేశారు పోలీసులు. 151 సెక్షన్‌ కింద ముందస్తుగా అరెస్ట్‌ చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

భద్రతా పరమైన కారణాల దృష్ట్యా అరెస్టు చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖకు వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయం దగ్గరలో వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న విషయం తెలిసిందే. బాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వారు చంద్రబాబు గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు రెండు గంటల పాటు కారులోనే ఉండిపోయారు. ఆ తర్వాత రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్‌ సర్కార్‌పై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం దుర్మార్గపు చర్యలకు దిగుతోందని ధ్వజమెత్తారు. ప్రజలు కనుక తిరుగుబాటు చేస్తే ఎవ్వరు ఏమి చేయలేరని అన్నారు. ఇక ఎయిర్‌పోర్టులో చంద్రబాబుతో పోలీసులు చర్చలు జరపడంతో వెనక్కివెళ్లేందుకు అంగీకరించారు. దీంతో విజయవాడకు వెళ్లేందుకు విమానాలు లేకపోవడంతో చివరకు హైదరాబాద్‌ విమానం ఎక్కి తిరుగు ప్రయాణం అయ్యారు.



Next Story