మే 4న ఏపీకి కేంద్ర బృందం రాక
By సుభాష్ Published on 30 April 2020 11:46 AM ISTముఖ్యాంశాలు
రెండు రోజుల పాటు రాష్ట్రంలో మకాం
లాక్డౌన్, ఇతర అంశాలపై అధ్యయనం
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కాలరాస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు మే 3వ తేదీ వరకూ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్డౌన్ పొడిగించాలా..? వద్దా అనే ఆలోచనలో ఉంది కేంద్రం. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు, సలహాలు తీసుకున్నారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ మే 3 తర్వాత కూడా లాక్డౌన్ పొడిగించాలని మోదీకి సూచించారు.
ఇక ఏపీలో లాక్డౌన్ పొడిగించాలా..? వద్దా అనే అంశంతో పాటు మరో ఆరు కీలక అంశాలపై సమీక్షించేందుకు కేంద్ర బృందాలు మే 4వ తేదీన ఆంధ్రప్రదేశ్కు రానున్నాయి. రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఉండి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనున్నాయి బృందాలు. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో లాక్డౌన్ పొడిగించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
వలస కూలీలకు తీపి కబురు
కాగా, దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా వలస కూలీలు, కార్మికులు, విద్యార్థులు, ఇతరులు ఇతర రాష్ట్రాలలో చిక్కుకుపోయారు. అలాంటి వారికి కేంద్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి స్వస్థలాలకు చేర్చడంపై బుధవారం కేంద్ర హోంశాఖ పలు మార్గదర్శకాలు జారీచేసింది. లాక్డౌన్తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. అయితే సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. రెండు రాష్ట్రాల అనుమతితో వారి ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.