కేంద్ర బడ్జెట్లో రవాణా రంగానికి పెద్దపీట
By సుభాష్
పార్లమెంట్ సమావేశాల సందర్భంగా శనివారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో రవాణా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ల అభివృద్ధితో పాటు రైల్వే వ్యవస్థల ఆధునికీకరణ, సౌకర్యాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రవాణా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. లక్షా 70 వేల కోట్లు కేటాయించారు. ఉడాన్ పథకంలో భాగంగా 2024 నాటికి దేశంలోని మరో 100 విమానాశ్రయాల అభివృద్ధికి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.
బెంగళూరులో రూ. 18,600 కోట్లతో నిర్మించిన తలపెట్టిన మెట్రో తరహా సబర్బన్ రైలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 20 శాతం నిధులను అందించనున్నట్లు పేర్కొన్నారు. ముంబాయి- అహ్మాదాబాద్ మధ్య నడపనున్న హైస్పీడ్ రైళ్లను మరికొన్ని ముఖ్య ప్రాంతాల్లో అందుబాటులో తీసుకురానున్నట్లు చెప్పారు.
చెన్నై - బెంగళూరు మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ హైవే
చెన్నై- బెంగళూరు మధ్య కొత్త ఎక్స్ ప్రెస్ వే ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రధాన పర్యాటక కేంద్రాలను కలుపుతూ తేజస్ లాంటి రైళ్లను ఏర్పాటు చేస్తామని, రైలు మార్గాలకు ఇరువైపులా వీలున్న చోట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.