సీబీఐ అధికారుల ముసుగులో అరాచకాలు.. చివరికి ఏమైందంటే..!
By అంజి Published on 18 Jan 2020 8:25 PM IST
ఢిల్లీ: డబ్బు కోసం కొంత మంది అడ్డదారులు తొక్కుతున్నారు. కొన్ని సందర్భాల్లో డబ్బుల కోసం పెద్ద స్థాయి అధికారుల పేరుతో డబ్బులు గుంజే ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా తాజాగా జల్సాలకు, విలాసవంతమైన జీవితం గడపడానికి ఇద్దరు ఆగంతకులు.. సీబీఐ అధికారుల వేషంలో ఓ నిందితుడి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశారు. కానీ చివరి క్షణంలో సీబీఐ అధికారులకే చిక్కారు.
సీబీఐ అధికారుల పేరుతో లంచాలు డిమాండ్ చేసిన ఇద్దరు ఆగంతులకు సీబీఐ చెక్ పెట్టింది. ఆ ఇద్దరు నిందితులను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులు హైదరాబాద్కు చెందిన మనివర్ధన్ రెడ్డి, మధురైకి చెందిన సెల్వం రాజ్గా గుర్తించారు. బ్యాంకు మోసం కేసులో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న నిందితుడిని కలిసి లంచాలు ఇవ్వాలని ఇద్దరు ఆగంతకులు డిమాండ్ చేశారు. అనంతరం సీబీఐ కేసు నుంచి తప్పించేందుకు సహకరిస్తామని ఆశ చూపారు. సీబీఐ సీనియర్ అధికారులుగా నిందితుడికి ఆ ఇద్దరు వ్యక్తులు పరిచమయ్యారు.
సీబీఐ న్యూఢిల్లీ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నట్లుగా సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ నిందితుడికి ఇద్దరు ఆగంతకులు కాల్ చేశారు. లంచం ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు కూడా చేశారు. గుంటూరు వెళ్లి బ్యాంక్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని ఆగంతకులు బెదిరించారు. ఈ నెల 16న కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఆగంతకులను అరెస్ట్ చేశారు. చెన్నై, హైదరాబాద్, ముధరై, శివకాశిలో అధికారులు తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లు, వాట్సాప్ కమ్యూనికేషన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు నిందితులను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచారు.