దిగ్విజయ్ సింగ్పై కేసు నమోదు
By సుభాష్ Published on 16 Jun 2020 2:19 AM GMTకాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్పై కేసు నమోదైంది. మార్ఫింగ్ వీడియోను షేర్ చేసిన ఘటనలో మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే డిగ్గిరాజా షేర్ చేసిన వీడియోలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండటంతో బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ హయాంలో మద్య విధానంపై శివరాజ్సింగ్ మాట్లాడిన మాటలను ద్విగ్విజయ్ సింగ్ తారుమారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని బీజేపీ నేత, మాజీ హోంశాఖ మంత్రి ఉమాశంకర్ గుప్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ట్వీట్కు సంబంధించి స్క్రీన్ షాట్లు, ఇతర ఆధారాలతో పోలీసులకు అందజేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
కాగా, ఫిర్యాదుపై క్రైమ్ బ్రాంచ్ అధికారి నిశ్చల్ ఝారియా మాట్లాడుతూ.. సోషల్ మీడియాను పర్యవేక్షించే సైబర్ విభాగం దిగ్విజయ్పై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు వెల్లడించారు. ఇక ఈ విషయంపై ద్విగ్విజయ్ పలు ఆరోపణలు గుప్పించారు. రాజకీయ కక్షతోనే ప్రభుత్వం తనపై కేసు నమోదు చేసిందని డిగ్గిరాజా ఆరోపించారు. అసలు ఆ వీడియోను ఎవరు మార్ఫింగ్ చేశారో కూడా దర్యాప్తు చేయాలన్నారు. కావాలని లేనిపోనివి సృష్టించి కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.