సామాన్యుడికి షాక్‌.. భారీగా పెరిగిన వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

LPG cylinder prices hiked by over Rs 50.మంగ‌ళ‌వారం ఉద‌యాన్నే చ‌మురు సంస్థ‌లు సామాన్యుల‌కు భారీ షాక్‌ను ఇచ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 March 2022 2:40 AM GMT
సామాన్యుడికి షాక్‌.. భారీగా పెరిగిన వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర

మంగ‌ళ‌వారం ఉద‌యాన్నే చ‌మురు సంస్థ‌లు సామాన్యుల‌కు భారీ షాక్‌ను ఇచ్చాయి. ఈ రోజు ఉద‌యం పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచిన చ‌మురు కంపెనీలు తాజాగా వంట‌గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ను సైతం పెంచేసింది. 14 కేజీల వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.50 మేర పెంచింది. పెంచిన ధ‌ర నేటి నుంచి అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని పేర్కొంది. తాజా పెంపుతో ఢిల్లీ, ముంబైలలో ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.949.50కు చేరింది. కోల్‌కతాలో వినియోగదారుడు సిలిండరుకు రూ.976 చెల్లించాల్సి ఉంటుంది. చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50 కి పెరిగింది. ఇక పాట్నాలో ఎల్‌పిజి సిలిండర్ ఇప్పుడు రూ. 1,039.50కి విక్రయిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ధ‌ర పెరిగింది. తెలంగాణ‌లో సిలిండ‌ర్ ధ‌ర రూ.1,002కు చేర‌గా.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1,008కి పెరిగింది.

ఉక్రెయిన్-ర‌ష్యా మ‌ధ్య యుద్దం కార‌ణంగా అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో చ‌మురు సంస్థ‌లు త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇప్ప‌టికే యుద్దాన్ని సాకుగా చూసి కొన్నింటి ధ‌ర‌ల‌ను పెంచి వ్యాపారులు విక్ర‌యిస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా వంట నూనె ధ‌ర‌లు నెల రోజుల వ్య‌వ‌ధిలో దాదాపు 20 నుంచి 30 శాతం పెరిగింది. పెరుగుతున్న ధ‌ర‌ల‌తో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు.

Next Story